అచ్చం షీనాబోరా హత్య లాగే!: డీజిల్ పోసి నిప్పంటించారు
ముంబై: షీనా బోరా మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే విధంగా మహారాష్ట్రలోని దహను అడవిలో ఓ యువతిని సూటికేసులో కుక్కి డీజిల్ పోసి నిప్పంటించిన ఘటన తాజాగా వెలుగుచూసింది.
సమాచారం అందుకున్న వంగాన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బుధవారం ఈ హత్య జరిగి ఉండొచ్చని వంగాన్ పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు హత్యకు గురైన యువతి వయసు 18 నుంచి 20 ఏళ్ల మధ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు.
అయితే యువతిని వేరే చోట హత్య చేసి శవాన్ని సూట్ కేసులో తీసుకొచ్చి వంగాన్-కాసా రోడ్డులో ఉన్న దహను అడవుల్లోని నిర్జన ప్రదేశంలో తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దహను అడవుల్లో కాలిపోయి ఉన్న సూట్ కేసుని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలికి పూర్తిగా కాలిపోయిన శవాన్ని తాలుకా బూడిదను సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని గత గత కొన్ని రోజులుగా ఏమైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యా అనే కోణంలో విచారణ ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య మాదిరే ఈ హత్య కూడా పోలి ఉండటం పోలీసులకు పలు అనుమానాలకు తావిస్తోంది. 2012లో షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా కారు డ్రైవర్ సాయంతో హత్య చేయించి రాయిగడ్ జిల్లాలోని అడవుల్లో తగలబెట్టించిన సంగతి తెలిసిందే.