బోఫోర్స్ కుంభకోణం కాదు, అది మీడియా ప్రచారమే: ప్రణబ్
న్యూఢిల్లీ: బోఫోర్స్ ఒప్పందం.. కుంభకోణం అని నిర్ధారణ కాలేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. బోఫోర్స్ కుంభకోణం అని మీడియాలోనే వచ్చిందని, అది మీడియా ప్రయత్నం మాత్రమేనని అన్నారు. ఏ భారతీయ కోర్టు కూడా కుంభకోణమని నిర్ధారించలేదని చెప్పారు. స్వదేశ్ నేషనల్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విధంగా స్పందించారు.
స్వీడన్కు చెందిన హోవిట్జర్ తుపాకులను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు 1986లో కుదుర్చుకున్న రూ.1600 కోట్ల ఒప్పందంలో రూ.64 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు అభియోగాలు ఉన్నాయి. 'బోఫోర్స్' దెబ్బకు 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.
బోఫోర్స్ కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన ఇటాలియన్ వ్యాపారి ఒట్టావియో ఖత్రోకీ, అరెస్టును తప్పించుకునేందుకు 1993లో భారత్ను విడిచి పారిపోయాడు. అతడి అప్పగింత కోసం సిబిఐ రెండుసార్లు విఫలయత్నాలు చేసింది.
తొలుత 2002లో మలేసియాను, తర్వాత 2007లో అర్జెంటీనాను ఖత్రోకీ అప్పగింత కోసం కోరినా ఫలితం లేకపోయింది. కాగా, 2013 జులైలో ఇటలీలోని మిలాన్ నగరంలో అతడు గుండెపోటుతో మృతి చెందాడు.