విశాఖ లీకేజీ తర్వాత మూడో ప్రమాదం.. ప్రఖ్యాత ఎన్ఎల్సీలో భారీ పేలుడు..
లాక్డౌన్ సడలింపుల వేళ దేశవ్యాప్తంగా ఒకేరోజు మూడు పారిశ్రామిక ప్రమాదాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ లోవి విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ప్లాంటులో విషవాయువు లీకైన ఘటనలో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్గఢ్ లోని రాయ్గఢ్ జిల్లాలో ఓ పేపర్ ప్లాంటులో ప్రమాదకర గ్యాస్ లీకై 11 మంది కార్మికులు ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా తమిళనాడులోని ప్రఖ్యాత నైవేలీ లిగ్నైట్ కొర్పొరేషన్(ఎన్ఎల్సీ) ప్లాంటులో భారీ ప్రమాదం సంభవించింది.
విశాఖ లీకేజీ: విస్పోటనం తప్పదా?.. వచ్చే 10 రోజులు భయానకం.. ప్రాణాలకు పూచీ ఉందా?
తమిళనాడులోని కడలూరు జిల్లాలో విస్తరించిన లిగ్నైట్ గనులకు అనుబంధంగా కొనసాగుతోన్న నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) నవరత్నాల్లో ఒకటిగా గుర్గింపు పొందింది. అక్కడి థర్మల్ పవర్ స్టేషన్లో బాయిలర్ పేలడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్లాంట్ నుంచి దట్టంగా పొగలు ఎగిసిపడ్డాయి. బాధితుల్ని ఆస్పత్రులకు తరలించిన అధికారులు.. షార్ట్ సర్క్యూట్ కారణంగా అధిక వేడిమి వెలువడడంతో ఒత్తిడికి గురై బాయిలర్ పేలి ఉంటుందని చెప్పారు.
ఎన్ఎల్సీ థర్మల్ ప్లాంటు పేలుడుతో ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బాయిలర్ పేలిన విషయం తెలిసిన వెంటనే కంపెనీకి చెందిన రిలీఫ్, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ, ప్రభుత్వాధికారులు ప్రయత్నిస్తున్నారు. గాయపడ్డవాళ్లలో ముగ్గురి కండిషన్ సీరియస్ గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.