సల్మాన్ ఖాన్ పెద్ద గజని, బ్రైన్ లేదు: రాజ్ థాక్రే
ముంబై: "ఆ హీరో ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో అతనికే తెలియదు. అతని బంధువుల గురించి తెలియదు. దేశంలో, ప్రపంచంలో ఏమి జరుగుతుందో టీవీ, డైలీ న్యూస్ పేపర్లు చూస్తే విషయాలు తెలుస్తాయి. ఎదైనా తెలుసుకుని మాట్లాడాలి" అని కండల వీరుడు సల్మాన్ ఖాన్ మీద మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే మండిపడ్డారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై రాజ్ థాక్రే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబై దాడుల సూత్రధారి యాకూబ్ మెమెన్ ఉరి శిక్షను తప్పుబట్టిన సల్మాన్ ఖాన్ ఒక బ్రైన్ లేని హీరో, అతనో పెద్ద గజని అంటు ఎద్దేవా చేశారు.
సల్మాన్ ఖాన్ కనీసం పరిజ్ఞానం లేకుండ మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి అయిన యాకూబ్ మెమెన్ కు ఉరి శిక్ష వెయ్యడం సరికాదని ఏలా అంటాడని ప్రశ్నించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఎవరైనా ప్రశ్నిస్తారా అని సూటిగా అడిగారు.
"మెమెన్ ఒక ఉగ్రవాది. అతను జరిపిన దాడుల వలన అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, అలాంటి వ్యక్తిని ఉరి తియ్యడం సరికాదని సల్మాన్ ఖాన్ మాట్లాడటం సిగ్గు చేటు" అని నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే విచారం వ్యక్తం చేశారు.
సల్మాన్ ఖాన్ తండ్రి గౌరవమైన వ్యక్తి అంటు కితాబు ఇచ్చారు. పనిలో పనిగా బీజేపీ ప్రభుత్వం మీద ఆరోపణలు గుప్పించారు. బీజేపీ దేశంలో అల్లర్లు సృష్టించి ఆందోళనకర పరిస్థితులు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుందని రాజ్ థాక్రే ఆరోపించారు.