Farmers Protest:రెండుగా చీలిన బాలీవుడ్: అక్షయ్-దేవగన్లపై కత్తులు నూరిన తాప్సీ సోనాక్షి
ఢిల్లీ: ఢిల్లీలో రైతు నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగి 70 రోజులకు పైగా అయ్యింది. రైతు నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం పలుమార్లు చర్చలు కూడా జరిపింది. కానీ చర్చలు ఫలించలేదు. దీంతో రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతో దేశ విదేశాలకు భారత్లో జరుగుతున్న రైతు నిరసనలు మీడియా ద్వారా పాకడంతో పలు అంతర్జాతీయ సెలబ్రిటీలు రైతులకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఎవ్వారం మరో మలుపు తీసుకుంది.
ప్రభుత్వానికి మద్దతుగా అక్షయ్, దేవ్గన్
సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు గత 70 రోజులుగా ఢిల్లీ రోడ్లపైకొచ్చి నిరసనలు చేపడుతుండటంతో అంతర్జాతీయ సెలబ్రిటీలు రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రముఖ పాప్ సింగర్ రిహానా రైతులకు మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేయడంతో మన దేశంలోని సెలబ్రిటీలు ప్రభుత్వానికి అండగా ఉంటూ ట్వీట్ చేయడంతో దుమారం రేగింది. రైతు కష్టాలపై వారు చేస్తున్న నిరసనలపై బాలీవుడ్లోని ఓ వర్గం అండగా నిలుస్తుండగా మరికొందరు టాప్ సెలబ్రిటీలు మాత్రం ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక రిహానా ట్వీట్కు బాలీవుడ్ టాప్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్లు వ్యతిరేకంగా ట్వీట్ చేయడంతో ఈ ఎపిసోడ్ మరో మలుపుతీసుకుంది.
సెలబ్రిటీల ట్వీట్తో రెండుగా చీలిన బాలీవుడ్?
అక్షయ్ కుమార్ అజయ్ దేవ్గన్లు ప్రభుత్వానికి మద్దతుగా ట్వీట్ చేశారు. అంతకుముందు విదేశీ వ్యవహారాల శాఖ స్పందిస్తూ రైతులు చేపడుతున్న నిరసనలపై లేదా సాగు చట్టాలపై అవగాహన లేకుండా కామెంట్స్ చేయడం సరికాదంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు ఇండియా టుగెదర్, ఇండియా అగెనెస్ట్ ప్రాపగాండ అనే హ్యాష్ట్యాగ్ను చేర్చింది. దీనికి మద్దతు తెలిపారు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, లతా మంగేష్కర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, కరణ్ జోహార్తో పాటు మరికొందరు సెలబ్రిటీలు. తప్పుడు ప్రచారాలు నమ్మరాదని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరుతూ ట్వీట్ చేశారు.అంతేకాదు బేదాభిప్రాయాలను సృష్టిస్తున్నారని వారితో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. వీరు చేసిన ట్వీట్ ఇప్పుడు బాలీవుడ్ను రెండుగా చీల్చుతోంది.
తాప్సీ ఆన్ ఫైర్
ఈ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై మండిపడింది నటి తాప్సీ పన్ను. రైతుల కష్టాలు తెలియకుండా అక్షయ్, అజయ్ దేవ్గన్లు ప్రభుత్వానికి మద్దతు తెలపడం సరికాదని మండిపడ్డింది. రైతులు కొన్ని రోజులుగా రోడ్లెక్కారని వ్యవస్థను బలోపేతం చేయడం మానేసి ప్రభుత్వమే తప్పుడు ప్రచారంకు దిగుతుండటం సరికాదని హితవు పలికింది. ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న స్టార్లు వ్యవహారం కూడా మంచిది కాదని చెప్పింది. "ఒక్క ట్వీట్ మీ సమగ్రతను దెబ్బతీసి ఉంటే, ఒక్క ట్వీట్ మీ నమ్మకంను దెబ్బతీసి ఉంటే, ఒక్క ప్రదర్శన మీ మత విశ్వాసాలను దెబ్బతీసిందని భావిస్తే మీరు ఎంతో విలువైనవిగా భావిస్తున్న ఈ అంశాలను లేదా వ్యవస్థలను బలోపేతం చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. అంతేకానీ ఇతరులు చేస్తున్న ప్రచారాన్ని మీ భుజాల మీద మోసుకుని మద్దతుగా నిలవడం సరికాదు" అని తాప్సీ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సోనాక్షి సిన్హా ఏమన్నారంటే..
ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ పక్కన ఎన్నో చిత్రాల్లో నటించిన సోనాక్షి సిన్హా కూడా రిహానాకు మద్దతుగా నిలిచింది. దేశంలో మానవహక్కుల ఉల్లంఘన జరగడంపై, ఇంటర్నెట్ను బంద్ చేయడం, ప్రభుత్వం చేస్తున్న ప్రచారం, విద్వేషాలు రగిల్చే ప్రసంగాలు, అధికార దుర్వినియోగంపై మాత్రమే అంతర్జాతీయ సెలబ్రిటీలు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని సోనాక్షి సిన్హా తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. ఇది భారత అంతర్గత విషయం అని చెప్పిన కొందరి సెలబ్రిటీలకు సమాధానంగా మరో స్టోరీ రాసుకొచ్చింది సోనాక్షి సిన్హా. రైతులకు మద్దతుగా ఉన్న అంతర్జాతీయ సెలబ్రిటీలు గ్రహాంతర వాసులు కాదని, వారు కూడా తోటి మానవులే అని గుర్తుచేస్తూ వారంతా మానవహక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారని వివరించింది.
మొత్తానికి రైతు నిరసనలు ప్రపంచదేశాలకు పాకాయి. ఇక ట్విటర్ వార్ ఊపందుకుంది. రైతులకు పలువురు అంతర్జాతీయ స్టార్లు మద్దతుగా నిలుస్తుండగా ఇక్కడ మాత్రం మోడీ సర్కార్కు పలువురు భారతీయ సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. అయితే వారిని కౌంటర్ చేస్తూ మరో వర్గం కూడా తయారైంది. దీంతో రైతు ఉద్యమం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచిచూడాలి.