బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. క్వాన్ టాలెంట్ ఏజెన్సీ తో లింక్ ఏంటి ? అసలీ ఏజెన్సీ ఏం చేస్తుంది?
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఈ కేసులో బాలీవుడ్లో జరుగుతున్న పార్టీలు, సెలబ్రిటీలు డ్రగ్స్ పై చేస్తున్న సంభాషణలతో పాటు క్వాన్ టాలెంట్ ఏజెన్సీ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇంతకీ క్వాన్ టాలెంట్ ఏజెన్సీ ఏం చేస్తుంది ? బాలీవుడ్ సెలబ్రెటీలకు, ఆ ఏజెన్సీ కి ఉన్న సంబంధం ఏంటి? తాజాగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ ఈ వ్యవహారంలో ఆ ఏజెన్సీ పాత్ర ఏంటి ? అన్నది ఇప్పుడు బాలీవుడ్ వర్గాల లో హాట్ టాపిక్ గా మారింది.
సెలబ్రిటీల వద్ద పని చేసే టాలెంట్ మేనేజర్లు క్వాన్ టాలెంట్ ఏజెన్సీకి చెందినవారు
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి ద్వారా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వద్ద పనిచేసిన మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా సెలబ్రిటీల డ్రగ్స్ విషయంలో కీలక భూమిక పోషించినట్లుగా గుర్తించారు. అంతేకాదు దీపికా పదుకొనే తోపాటుగా, దీపికా పదుకొనే మేనేజర్ గా పని చేస్తున్న కరిష్మా ప్రకాష్ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నట్లుగా గుర్తించారు. జయసాహా , కరిష్మా ప్రకాష్ ఇద్దరూ క్వాన్ టాలెంట్ ఏజెన్సీ కోసం పనిచేసే వారు కావడంతో అసలు క్వాన్ ఏజెన్సీ ఏం చేస్తుందన్న దానిపై చర్చ మొదలైంది.
సినీ, టీవీ రంగాల ప్రముఖులకు సేవలు అందించే ఏజెన్సీ 'క్వాన్'
క్వాన్ టాలెంట్ ఏజెన్సీ ముంబైలో ఫేమస్ అయిన సినిమా, టీవీ రంగాలకు సంబంధించిన ప్రముఖులకు సేవలు అందించే ఒక ఏజెన్సీ. బాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన అనేక సినిమా ఒప్పందాలను, ప్రకటనలను, వారి వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలకు వారికి తోడ్పాటు నందించడం, సినీ నిర్మాణ సంస్థలు, దర్శకులు, రచయితలకు చెందిన అనేక ఆర్థిక లావాదేవీలను ఈ సంస్థ చూస్తుంది. ఇందులో భాగంగానే ఈ సంస్థ నుండే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వద్ద పనిచేసిన మాజీ టాలెంట్ మేనేజర్ జయసాహా , ప్రస్తుతం దీపికా పదుకొనే వద్ద వున్న మేనేజర్ కరిష్మా ప్రకాష్ లు పని చేస్తున్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది ఈ ఏజెన్సీ లో భాగమే
అనిర్భర్ బ్లా , ఇంద్రనీల్ బ్లా, మధు మంతెన, విజయ్ సుబ్రమణియం , ధ్రువ్ తో కలిసి 2009లో క్వాన్ టాలెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. ఏజెన్సీ ప్రారంభించిన నాటి నుండి ఎంతో మంది పేరు పొందిన బాలీవుడ్ సెలబ్రిటీలు ఇందులో భాగమయ్యారు. దీపికా పదుకొనే 2013 నుండి క్లయింట్ గా కొనసాగుతున్నారు . సోనమ్ కపూర్, రణబీర్ కపూర్ , కృతిసనన్, హ్రితిక్ రోషన్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలకు క్వాన్ టాలెంట్ ఏజెన్సీ సేవలు అందిస్తుంది. అందులో భాగంగా వారి వద్ద పని చేసే టాలెంట్ మేనేజర్లుగా క్వాన్ తమ సంస్థ నుండి పలువురిని పంపింది.
క్వాన్ సంస్థ టాలెంట్ మేనేజర్ల ద్వారా డ్రగ్స్ వ్యవహారం బయటకు
టాలెంట్ మేనేజర్ ల ద్వారా డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూడటం తో క్వాన్ ఏజెన్సీపై చర్చ జరుగుతుంది. క్వాన్ ఏర్పాటు చేసిన తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే మంచి లాభాలు రావడంతో దీనిని లాస్ ఏంజిల్స్ లోని ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ తో భాగస్వామ్యం కలుపుకొని సీఏఏ క్వాన్ గా మార్చారు. అనతికాలంలోనే ఒక ఫేమస్ కంపెనీగా గుర్తింపు పొందిన క్వాన్ 2016లో ఏకంగా సిఏఏ ని కొనుగోలు చేసింది.
గతంలో మీటూ ఆరోపణలు , తాజాగా డ్రగ్స్ కేసుతో లింకులు
2009 నుండి అంచెలంచెలుగా ఎదిగిన ఈ సంస్థ 2018లో ఈ సంస్థ సీఈవో పై మీటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో వార్తల్లో నిలిచింది. మీ టూ ఆరోపణలతో అనిర్భర్ బ్లా క్వాన్ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో సిఇఓగా సుబ్రమణియం బాధ్యతలు తీసుకున్నారు. అదే సమయంలో జయసాహా కూడా ఈ ఏజెన్సీ లో రెండు శాతం వాటాను కొనుగోలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ సంస్థకు చెందిన మధు మంతెన ను, జయసాహాను, కరిష్మా ప్రకాష్ ను, ఈ సంస్థతో లింక్ ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ జరుపుతున్నారు. అందుకే ప్రస్తుతం క్వాన్ టాలెంట్ ఏజెన్సీ కార్యాకలాపాలు ఏంటి అన్నది హాట్ టాపిక్ అయ్యింది .