అర్నాబ్ గోస్వామి కథ క్లోజేనా.. బాలీవుడ్ ఇండస్ట్రీ కథనాలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..!
గతకొద్ది రోజులుగా రెండు న్యూస్ ఛానెళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అవాస్తవాలను ప్రసారం చేయడమే కాకుండా ఇండస్ట్రీ పరువు పోయేలా వ్యవహరిస్తున్నాయంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాలీవుడ్ అంటే డ్రగ్స్ అని మాత్రమే అనిపించేలా కథనాలను టెలికాస్ట్ చేస్తున్నాయంటూ కోర్టును ఆశ్రయించింది బాలీవుడ్. అయితే ఈ పిటిషన్ వేసేందుకు పలువురు టాప్ బాలీవుడ్ నటులు ఒక్కటయ్యారు. ఖాన్ త్రయంతో పాటు అక్షయ్ కుమార్, కరణ్ జోహార్, ఇతర బాలీవుడ్ నిర్మాతలు కలిసి పిటిషన్ దాఖలు చేశారు.
Recommended Video
అర్నాబ్ గోస్వామి పై ఢిల్లీ కోర్టులో...
ఇక ఈ పిటిషన్లో నాలుగు బాలీవుడ్ ఇండస్ట్రీ సంఘాలతో పాటు 34 మంది నిర్మాతలు రిపబ్లిక్ టీవీ ఆ ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, ఆ ఛానెల్ రిపోర్టర్ ప్రదీప్ భండారీలపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు మరో ఛానెల్ టైమ్స్ నౌతో పాటు ఆ ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ శివశంకర్ మరియు గ్రూప్ ఎడిటర్ నవికా కుమార్తో పాటు మరికొందరిపై పిటిషన్ దాఖలు చేశారు. బాలీవుడ్ గురించి అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రసారం చేస్తున్నారని వీటిని నిలిపివేసేలా ఈ రెండు ఛానెళ్లతో పాటు సోషల్ మీడియా వేదికలకు కూడా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. బాలీవుడ్పై అవాస్తవ కథనాలు ప్రసారం చేస్తూ ఈ రెండు ఛానెళ్లు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాయంటూ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు హిందీ సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వ్యక్తుల వ్యక్తిగత హక్కులను ఈ ఛానెల్స్ కాలరాసేలా వ్యవహరిస్తున్నాయంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
బాలీవుడ్ ఇండస్ట్రీపై దుష్ప్రచారం..?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో ప్రారంభమైన కథనాలు ఆ తర్వాత డ్రగ్స్ వైపు మరలాయి. అసలు బాలీవుడ్ అంటేనే డ్రగ్స్ అనే రంగును పులుముతున్నాయంటూ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ పిటిషన్ ఈ వారాంతంలో విచారణకు రానుంది. ఛానెల్స్ ప్రసారాలను ఒకేసారి నిలపమని కోరడం లేదని అయితే బాలీవుడ్ ఇండస్ట్రీపై దుష్ప్రచారాన్ని మాత్రమే తొలగించాలని కోరుతున్నట్లు నిర్మాతల సంఘం పేర్కొంది. తమ కథనంలో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీని కించపరుస్తూ వినియోగించిన పదప్రయోగాన్ని తొలగించాలని కోరినట్లు వెల్లడించింది నిర్మాతల సంఘం. ఇప్పటికే కరోనా కారణంగా ఇటు ఉపాధి అటు రెవిన్యూ పరంగా నష్టపోయామని మళ్లీ ఈ ఛానెల్స్ చేసే కంపుతో తీవ్రంగా నష్టపోతామని కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి.
బాలీవుడ్ అంటే ఆ 20 మంది సూపర్ స్టార్లు కాదు
ఈ కష్టకాలంలో నిర్మాతల సంఘం తీసుకున్న తెలివైన నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ నిర్మాత తెలిపారు. బాలీవుడ్ అంటే ఓ 20 సూపర్ స్టార్ల గురించి కాదని ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు, నిర్మాతలు, టెక్నీషియన్స్తో పాటు ఇతరులు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తెరగాలని ఆ నిర్మాత చెప్పారు. కొన్ని లక్షల మందికి జీవనోపాధిగా మారిన ఇండస్ట్రీని చంపేసే ప్రయత్నం ఈ ఛానెల్స్ చేస్తున్నాయని ఆ నిర్మాత మండిపడ్డారు. ఎవరో కొంతమంది డ్రగ్స్తో సంబంధం ఉన్నంతమాత్రాన అది అందరికీ ఆపాదించడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు.
మొత్తానికి బాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతల సంఘం, సూపర్ స్టార్లు ఇతర నటులు తమ ఇండస్ట్రీని బతికించుకునేందుకు అంతా ఒకే తాటిపైకి రావడాన్ని చాలామంది హర్షిస్తున్నారు. అదే సమయంలో స్వాగతిస్తున్నారు.