బాలీవుడ్ నటి మమతా కులకర్ణికి అరెస్టు వారెంట్, రూ. 2 వేల కోట్ల డ్రగ్స్ డీల్, కెన్యాలో మకాం !
డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని విచారణలో వెలుగు చూడటంతో థాణేలోని ప్రత్యేక కోర్టు బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి, ఆమె భర్త విక్కీ గోస్వామిలకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
ముంబై: డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని విచారణలో వెలుగు చూడటంతో థాణేలోని ప్రత్యేక కోర్టు బాలీవుడ్ మాజీ నటి మమతా కులకర్ణి, ఆమె భర్త విక్కీ గోస్వామిలకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. మమతా కులకర్ణి, విక్కీ గోస్వామితో సహ మొత్తం 14 మంది డ్రగ్స్ సరఫరా చేశారని ప్రత్యేక న్యాయస్థానం చెప్పింది.
సుమారు రూ. 2,000 కోట్ల విలువైన ఎఫడ్రమ్ డ్రగ్స్ విక్రయించిన ముఠాలో మమతా కులకర్ణి, ఆమె భర్త విక్కీ గోస్వామితో సహ 14 మంది నిందితులు అంటూ పోలీసులు థాణెలోని ప్రత్యేక కోర్టులో సాక్షాలు సమర్పించారు. సుదీర్ఘంగా విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టు చివరికి గురువారం (జూన్ 8వ తేదీ) సంచనల తీర్పు వెల్లడించింది.
అరెస్టు వారెంట్లు, కెన్యాలో మకాం !
వెంటనే మమతా కులకర్ణి, ఆమె భర్త విక్కీ గోస్వామిలను అరెస్టు చెయ్యాలని ప్రత్యేక కోర్టు వారెంట్టు జారీ చేసింది. అయితే మమతా కులకర్ణి ఆమె భర్తతో కలిసి కెన్యాలోని మామోబాసా నగరంలో తలదాచుకోవడంతో పోలీసులు కేంద్ర ప్రభుత్వం, ఇంటర్ పోల్ అధికారులను ఆశ్రయిస్తున్నారు.
గ్లామర్ క్వీన్, నేడు డ్రగ్స్ ముఠాలో !
గతంలో బాలీవుడ్ లో గ్లామర్ తారగా ఓ వెలుగు వెలిగిన మమతా కులకర్ణి నేడు డ్రగ్స్ సరఫరా ముఠా నాయకురాలిగా అవతారమెత్తింది. బాలీవుడ్ తో పాటు ఈమె తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ సినిమాల్లో క్రేజ్ తగ్గడంతో అమ్మడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
15 ఏళ్లు దుబాయ్ జైల్లో !
1997లో విక్కీ గోస్వామి నిషేధిత మ్యాండ్రక్స్ డ్రగ్స్ (11.5 టన్నులు) తరలిస్తున్న సమయంలో యూఏఇ పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువుకావడంతో విక్కీ గోస్వామికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 15 ఏళ్లు దుబాయ్ జైల్లో ఉన్న విక్కీ గోస్వామి 2012 నవంబర్ 15వ తేదీ జైలు నుంచి విడుదలైనాడు.
జైలు నుంచి వస్తానే లవ్ తో !
2012 లో దుబాయ్ జైలు నుంచి విడుదలైన విక్కీ గోస్వామి (56), తన ప్రియురాలు మమతా కులకర్ణి (45)ని అదే సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. తరువాత కెన్యాకు మకాం మార్చేశారు. మమతా కులకర్ణి తరువాత ఇస్లాం మతం స్వీకరించి కెన్యాలోనే భర్తతో కలిసి జీవిస్తోంది.
కెన్యాలో అరెస్టు చేశారు !
డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ కెన్యాలోని నైరూబియాలో 2014లో స్థానిక పోలీసులు మమతా కులకర్ణి, ఆమె భర్త విక్కీ గోస్వామీలను అరెస్టు చేసి విచారణ చేశారు. తరువాత వారిద్దరిని విడిచిపెట్టారని అంతర్జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది.
డీ గ్యాంగ్ ఎఫెక్ట్, అందుకే దుబాయ్ లో !
విక్కీ గోస్వామి దుబాయ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, యూఎస్ లో డ్రగ్స్ సరఫరా చేసేవాడు. ఇతనికి చోటరాజన్ సహాయం చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న డీ గ్యాంగ్ చోటా రాజన్ ను దెబ్బకొట్టడానికి 1997లో దుబాయ్ పోలీసులకు పక్కా సమాచారం ఇచ్చి అరెస్టు చేయించారని తెలిసింది.
బాలీవుడ్ కు మాఫియా లింక్ ?
బాలీవుడ్ కు మాఫియాతో లింక్ ఉందని దశాబ్థాల నుంచి ఆరోపణలు ఉన్నాయి. హాజీ మస్తాన్ దగ్గర నుంచి అబు సలేం వరకు ఆ లింక్ ఉందని సమాచారం. మాఫియా దెబ్బకు మమతా కులకర్ణి బలి అయ్యింది. మహారాష్ట్రలోని థాణే పోలీసులు సోలాపురలోని ఓ ఫ్యాక్టరీలో రూ. 2,000 కోట్ల విలువైన 20 టన్నుల ఎఫడ్రాన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విక్కీ గోస్వామి. భర్తకు మమతా కులకర్ణి సహకరించిందని పోలీసులు గుర్తించారు. వీరిద్దరితో పాటు మనోజ్ జైన్, పునీత్ శింగ్రీ, ప్రదీప్ సింగ్ గిల్ తదితరులు నిందితులుగా ఉన్నారు.