రైతు ఆందోళనలపై స్పందించిన బాలీవుడ్ కండల వీరుడు: కర్ర విరక్కుండా..పాము చావకుండా
ముంబై: న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రైతులు సుదీర్ఘకాలంగా ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిని ముట్టడించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది.
బార్బేడియన్ నటి, గాయని రిహానా చేసిన ట్వీట్ తరువాత.. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. బాలీవుడ్ స్టార్ హీరోల నుంచి క్రికెటర్ల వరకూ అందరూ స్పందించారు. తాజాగా ఆ జాబితాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేరారు. తోటి నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గణ్, క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ వంటి ప్రముఖులు చేసిన ట్వీట్లపై చెలరేగిన వివాదాన్ని సల్మాన్ ఖాన్ బాగా అబ్జర్వ్ చేసినట్టుంది.
అందుకే ఆచి తూచి స్పందించారు. కర్ర విరగకుండా.. పాము చావకుండా వ్యవహరించారు. ఏది మంచిదో అదే చేయాలంటూ వ్యాఖ్యానించారు. అత్యధికులకు మంచి జరిగే నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. శుక్రవారం ఆయన మ్యూజిక్ రియాలిటీ షో ఇండియన్ ప్రొ మ్యూజిక్ లీగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సల్మాన్ ఖాన్ సమాధానం ఇచ్చారు. రైతుల ఆందోళనలపై వైఖరేమిటంటూ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఎలాంటి అంశంలోనైనా ఎవరికీ నష్టం జరగకూడదని అన్నారు. అలాంటి పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగుతోన్న రైతుల ఆందోళనలపై ఖాన్ త్రయం నుంచి తొలిసారిగా స్పందించింది సల్మానే. అమీర్ ఖాన్ గానీ, షారుక్ ఖాన్ గానీ ఇప్పటిదాకా తమ వైఖరేమిటో తెలియజేయలేదు.