కంగనా రనౌత్పై బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేస్తోన్న శివసేన: ఊర్మిళా మతోండ్కర్ చేరికకు ఓకే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకోనుంది. అధికారంలో ఉన్న శివసేనను టార్గెట్గా చేసుకుని ఘాటు విమర్శలతో చెలరేగిపోతోన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై సంధించడానికి బ్రహ్మాస్త్రం రెడీ అవుతోంది. కంగనాకు ధీటుగా కౌంటర్ ఇవ్వడానికి ఊర్మిళా మతోండ్కర్ను పార్టీలో చేర్చుకోబోతోంది. మంగళారం ఆమె శివసేన తీర్థాన్ని పుచ్చుకోనున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం ఊర్మళకు కొత్త కాదు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆ పార్టీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు. అనంతరం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏడాది కిందటే ఆమె కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. తాజాగా- శివసేన కండువాను కప్పుకోవడానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి సానుభూతిపరురాలుగా ఉంటూ శివసేనపై విమర్శల మీద విమర్శలను చేస్తూ వస్తోన్న కంగనా రనౌత్కు పోటీగా ఊర్మిళ మతోండ్కర్ను శివసేన ప్రోత్సహించడం ఖాయమని అంటున్నారు.
ముల్లును ముల్లుతోనే తీయాలనే బేసిక్ ఫార్ములాను శివసేన అనుసరిస్తోందని, బాలీవుడ్ నటిని అదే బాలీవుడ్కు చెందిన నటితో చెక్ చెప్పబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు - ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఊర్మిళా మతోండ్కర్ను సాఫ్ట్ పోర్న్స్టార్గా అభివర్ణించారు కంగనా. ఓ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఆమెకు తాను కట్టుబడి ఉన్నాననీ చెప్పారు.
అవే వ్యాఖ్యలను తన అధికారిక ట్విట్టర్లోనూ కంగనా రనౌత్ పోస్ట్ చేశారు. ఊర్మిళా మతోండ్కర్ వంటి ఓ సాఫ్ట్ పోర్న్స్టార్ తనను తప్పు పట్టడం సరికాదని కంగనా చెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని, అయినప్పటికీ.. దోషిగా చూస్తున్నారంటూ విమర్శించారు. శివసేన ప్రభుత్వ హయాంలో ముంబై..పాక్ ఆక్రమిత కాశ్మీర్గా మారిందంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను ఊర్మిళ తప్పుపట్టారు. అదే రేంజ్లో ఆమెను విమర్శించారు. ఆ తరువాతా వారిద్దరి మధ్య తరచూ వాగ్యుద్ధాలు నడిచాయి.