బాంబులు పెట్టి లేపేస్తా: నితీష్కు బెదిరింపు మెసేజ్
పాట్నా: బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ నేత నితీష్ కుమార్కు బాంబు బెదిరింపు ఓ సందేశం (ఎస్ఎంఎస్) ద్వారా వచ్చింది. నితీశ్ కుమార్ను బాంబు పెట్టి హతమారుస్తానని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎస్ఎంఎస్ ద్వారా హెచ్చరించాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు హిందీ వార్తా పత్రికలకు, టీవీ న్యూస్ ఛానెళ్లకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.
త్వరలోనే భారీ స్థాయిలో బాంబులు పెట్టి జేడీయూ నేత ముఖ్యమంత్రి నితీశ్ను హత్య చేస్తానని హెచ్చరించాడు. ఈ విషయం సదరు ఛానెళ్లు పోలీసులకు చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభించి ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎస్ఎంఎస్ ఆధారంగా శ్రీకృష్ణపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పాట్నా సీనియర్ ఎస్పీ వికాస్ వైభవ్ తెలిపారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని చెప్పారు. వేరే రాష్ట్రం నుంచి ఈ బెదిరింపు సందేశం వచ్చినట్లు గుర్తించామని తెలిపారు.
సిఎం నితీష్ కుమార్కు ఇప్పటికే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని చెప్పిన ఆయన.. బెదిరింపు సందేశం నేపథ్యంలో మరింత భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.