బీజేపీ కార్యాలయంపై బాంబు దాడి
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురం (త్రివేండ్రం)లోని బీజేపీ కార్యాయలయం మీద నాటు బాంబులతో దాడి చేశారు. అయితే బాంబు దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
తిరువనంతపురంలోని బీజేపీ కార్యాలయం ప్రధాన ద్వారం పైకి గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం వేకువ జామున 3.30 గంటల సమయంలో నాటు బాంబులతో దాడి చేశారు. ఈ బాంబుల దాడిలో తలుపులు, అద్దాలు ద్వంసం అయ్యాయి.
విషయం తెలుసుకున్న తిరువనంతపురం నగర పోలీసు కమిషనర్ స్పర్జన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాంబుల దాడి జరిగిన సమయంలో కార్యాలయం మొదటి అంతస్తులో నలుగురు బీజేపీ నాయకులు ఉన్నారని ఆయన చెప్పారు.
అయితే వారికి ఎలాంటి గాయాలుకాలేదని అన్నారు. బాంబు దాడిలో ఆస్తినష్టం జరిగిందని తెలిపారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని, నాటు బాంబులు వేసిన వారి కోసం గాలిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ స్పర్జన్ కుమార్ వివరించారు.