విమానానికి బాంబు బెదిరింపు: ల్యాండింగ్
నాగ్ పూర్: గాలిలో వెలుతున్న విమానంలో బాంబు ఉందని బెదిరింపు ఫోన్ చేసి నానా హంగామా సృష్టించిన సంఘటన శనివారం జరిగింది. అయితే అత్యవసరంగా విమానం ల్యాండ్ చేసి విమానంలో గాలించినా ఎలాంటి బాంబు లేదని వెలుగు చూసింది.
బాంబులు, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. శనివారం ఉదయం నాగ్ పూర్ నుంచి ముంబైకి గో ఎయిర్ విమానం బయలుదేరింది. విమానంలో ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.
విమానం బయలుదేరిన తరువాత గుర్తు తెలియని వ్యక్తి విమానాశ్రయానికి ఫోన్ చేశాడు. ముంబై వెలుతున్న గో ఎయిర్ విమానంలో బాంబు ఉందని, అది పేలిపోతుందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అధికారులు హడలిపోయారు.
వెంటనే గో ఎయిర్ విమానం పైలెట్ కు సమాచారం ఇవ్వడంతో నాగ్ పూర్ లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులను కిందకు దించి విమానం మొత్తం గాలించారు. విమానంలో ఎలాంటి బాంబులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.