బాంబు బెదిరింపు కాల్: ముంబైలో హై అలర్ట్
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని విమానాశ్రయానికి, తాజ్ హోటల్కి సోమవారం రాత్రి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ముంబైలోని పలు ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ముంబై విమానాశ్రయంలోని అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్లో, తాజ్ హోటల్లో బాంబు పెడతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు మాట్లాడుకుంటుండగా తాను విన్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి అధికారులకు చెప్పాడు.
ఈ నేపథ్యంలో బాంబు స్వ్కాడ్ అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ముంబైలో అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.
లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26/11న తాజ్ హోటల్లో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. మరోసారి ఇలాంటి దాడికి ఏమైనా ఉగ్రవాదులు ప్రయత్నించారా? అనే కోణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఈ బెదిరింపు కాల్స్ ఆకతాయిల పని కూడా అయి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.