హీరో చియాన్ విక్రమ్ ఇంటికి బాంబు బెదిరింపు: పోలీసులు అలర్ట్, తనిఖీలు
చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని బసంత్నగర్లో ఉన్న విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆగంతకులు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు విక్రమ్ ఇంటికి చేరుకుని గాలింపు చేపట్టారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫ్ఫర్ డాగ్స్ తనిఖీ చేశారు. అయితే, ఎక్కడా ఎలాంటి బాంబు లభ్యం కాలేదు. దీంతో ఇది ఆకతాయిలు చేసిన పనేనని పోలీసులు నిర్ధారించారు. ఆ ఫోన్ చేసినవారెవరో కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
కాగా, గతంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు రజినీకాంత్, విజయ్, సూర్య ఇళ్లల్లోనూ బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం గమనార్హం. అంతేగకా, గతంలో ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామికి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు.
ఇది ఇలావుండగా, ప్రస్తుతం విక్రమ్.. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 'కోబ్రా' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఏడు పాత్రల్లో కనిపిస్తుండటం విశేషం. ఇక మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీటితోపాటు మరో మూడు తమిళ సినిమాలకు కూడా విక్రమ్ సంతకం చేసి బిజీగా ఉన్నారు.