వరవరరావు బెయిల్ పిటిషన్ తిరస్కరణ... నిర్లక్ష్యం చేస్తే జైల్లోనే చనిపోతారేమోనన్న న్యాయవాది...
కవి,విప్లవ రచయిత,సామాజిక ఉద్యమకారుడు వరవరరావు(85) బెయిల్ పిటిషన్ను ముంబై హైకోర్టు కొట్టివేసింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన సతీమణి హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అందుకు నిరాకరించిన కోర్టు.. నానావతి ఆస్పత్రి వైద్య బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరవరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణనను నవంబర్ 17కి వాయిదా వేసింది. భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో వరవరరావును జూన్,2018లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన ముంబైలోని తలోజా జైల్లో రాజకీయ ఖైదీగా ఉన్నారు.
ఇద్దరు ప్రొఫెసర్లపై ఎన్ఐఏ సంచలన చార్జిషీట్.. నేపాల్ మావో అగ్ర నేతతో టచ్..
క్షీణిస్తున్న వరవరరావు ఆరోగ్యం...
వరవరరావు ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని.. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ముంబైలోని నానావతి ఆస్పత్రికి తరలించాలని వరవరరావు సతీమణి హేమలత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. హేమలత తరుపున న్యాయవాది ఇందిరా జైసింగ్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే వరవరరావు జైల్లోనే చనిపోయే అవకాశం ఉందని... అప్పుడది కస్టోడియల్ డెత్ అవుతుందని ఇందిరా జైసింగ్ పేర్కొన్నారు.
హక్కులకు భంగం కలిగిస్తున్నారన్న న్యాయవాది...
ప్రస్తుతం వరవరరావు మంచానికే పరిమితమై... జైల్లో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని... ఆయన 'డెమెన్షియా'తో బాధపడుతున్నారని ఇందిరా జైసింగ్ కోర్టుకు తెలిపారు. ఆయనకు డైపర్స్ తొడగాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం... వరవరరావు జీవించే హక్కుకు భంగం కలుగుతోందన్నారు. దీంతో హైకోర్టు... నానావతి ఆస్పత్రి వైద్య బృందం జైలుకు వెళ్లి వరవరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని మొదట సూచించింది. అయితే హైకోర్టు సూచనను ఎన్ఐఏ తరుపు న్యాయవాది,అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వ్యతిరేకించారు. ఇందిరా జైసింగ్ అభ్యర్థన సరైనది కాదన్నారు.
ఆ అభ్యర్థనను తప్పు పట్టిన ఎన్ఐఏ...
అనిల్ సింగ్ మాట్లాడుతూ... 'ఇలాంటి వినతులకు అనుమతిస్తే... రేప్పొద్దున ప్రతీ ఖైదీ... తమను నానావతి ఆస్పత్రికి తరలించమంటారు. ప్రభుత్వ వైద్యులను,ఆస్పత్రులను తక్కువ చేయడం సరికాదు.' అని పేర్కొన్నారు. చివరకు కోర్టు... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నానావతి ఆస్పత్రి వైద్య బృందం వరవరరావు ఆరోగ్యాన్ని తెలుసుకోవాలని సూచించింది. 'నిందితుడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది ప్రధాన ఆందోళన. కాబట్టి ఆయన్ను నేరుగా ఆస్పత్రికి తరలించడం కంటే... ముందు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో నానావతి వైద్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకోవాలి.' అని జస్టిస్ ఏకె మీనన్ నేత్రుత్వంలోని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది.
త్వరలోనే నివేదిక...
వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై నానావతి వైద్య బృందం త్వరలోనే కోర్టుకు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు,వరవరరావు కుటుంబం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం ఆ పిటిషన్ను విచారించేందుకు తిరస్కరించింది. ముంబై హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో వరవరరావు కుటుంబం ముంబై హైకోర్టును ఆశ్రయించింది. కాగా,భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో జూన్,2018న ఆయన అరెస్టయిన సంగతి తెలిసిందే. నిషిద్ధ మావోయిస్టు సంస్థలతో కలిసి ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో వరవరరావుతో పాటు పలువురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.