అద్భుతమైన తీర్పు: తల్లిదండ్రులు పిల్లలకిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కు తీసుకోవచ్చు
తమ పిల్లలకు వారసత్వంగా ఇచ్చే ఆస్తులను తిరిగి తల్లిదండ్రులు వెనక్కు తీసుకోవచ్చని బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వృద్ధాప్యంలో ఉండగా తల్లిదండ్రులను హింసించినా, సరిగ్గా చూసుకోలేకపోయినా పిల్లలకు తమ ఆస్తిని రాసిచ్చిన తల్లిదండ్రులు నిరభ్యంతరంగా వెనక్కు తీసుకునే అధికారం ఉందంటూ కోర్టు వ్యాఖ్యానించింది.
తనకు ఆస్తిని రాసిచ్చి తిరిగి తన తండ్రి తీసుకున్నాడంటూ ఆరోపిస్తూ ట్రిబ్యునల్ కోర్టులో ఓ యువకుడు పిటిషన్ వేశాడు. ట్రిబ్యునల్ తీర్పు యువకుడికి నిరాశే మిగిల్చింది. దీంతో ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ రంజిత్ మోర్, అనూజా ప్రభుదేశాయ్లతో కూడిన ధర్మాసనం పై విధంగా తీర్పును వెలువరిస్తూ యువకుడికి షాక్ ఇచ్చింది.
కొడుకుకు తన ఆస్తిని కానుక రూపంలో తండ్రి రాసిచ్చాడంటే కొడుకు కోడలు తనను బాగా చూసుకుంటారన్న ఉద్దేశంతోనే అని కోర్టు భావించింది. అయితే ఇక్కడ తండ్రికి రెండో భార్య ఉండటంతో ఆమెను చూసుకునేందుకు యువకుడు నిరాకరించాడు. తనను తన రెండవ భార్యను జాగ్రత్తగా చూసుకుంటారన్న విశ్వాసంతోనే తండ్రి తన ఇంటిలోని సగభాగాన్ని కొడుకు పేరుమీద రాశారు కనుక కొడుకు తప్పకుండా వారిని చూసుకోవాల్సిందేనంటూ కోర్టు అభిప్రాయపడింది. లేనిపక్షంలో ఆ ఆస్తిని తిరిగి తండ్రి తీసుకోవచ్చని చెప్పింది.
మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ 2007 చట్టం ప్రకారం వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, పెద్దలనుంచి ఏమైనా ఆస్తులు పొందితే అలాంటి పెద్దలను పిల్లలు పరిరక్షించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని కోర్టు తెలిపింది. వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన కనీస బాధ్యత పిల్లలదేనంటూ వ్యాఖ్యానించింది.