తీస్తా దంపతులకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ/ముంబై: గుజరాత్ కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్ లు ఊపిరి పీల్చుకున్నారు. వీరిద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో కొంత ఊరట లభించింది. శుక్రవారం బాంబే హై కోర్టు తీస్తా దంపతులకు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 10వ తేది వరకు వీరిని అరెస్టు చెయ్యరాదని కోర్టు సూచించింది.
2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలో దాడులలో మరణించిన వారి స్మారకార్థం మ్యూజియం ఏర్పాటు చేస్తామంటు తీస్తా దంపతులు విదేశాల నుండి నిధులు స్వీకరించారు. అధికారుల అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుండి విదేశీ నిధులు సేకరించారు.
తరువాత ఆ నిధులను దుర్వినియోగం చేశారని, తీస్తా మద్యం సేవించడానికి, ఆమె కేశసౌందర్యానికి ఎక్కువ ఖర్చు చేశారని ఆరోపిస్తూ తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్ ల మీద కేసు నమోదు అయ్యింది. సీబీఐ అధికారులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తమకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని తీస్తా దంపతులు సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అయితే సీబీఐ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో వీరు బాంబే హై కోర్టును ఆశ్రయించారు. బీజేపీ ప్రభుత్వం కావాలనే మమ్మల్ని వేధిస్తున్నదని తీస్తా సెతల్వాద్ దంపతులు ఆరోపిస్తున్నారు.