షాకింగ్! 56 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల మైనర్ బాలిక వివాహానికి ఓకే చెప్పిన హైకోర్టు
ముంబై: మైనర్ బాలికలను పెళ్లాడటం చట్టరీత్యా నేరం. చట్టాలన్నీ ఈ విషయాన్నే ఘోషిస్తున్నాయి. మైనర్లపై అత్యాచారం చేసినా, లైంగిక దాడులకు పాల్పడినా.. న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తాయి. కఠిన కారాగార శిక్షలను విధిస్తాయి. ఈ విషయం మనకు తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బోంబే హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు..ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీసేలా కనిపిస్తోంది. 56 సంవత్సరాల వ్యక్తి, 14 సంవత్సరాాల బాలికను వివాహం చేసుకోవడాన్ని బోంబే హైకోర్టు సమర్థించింది. వారి వివాహానికి సమ్మతించింది. పచ్చజెండా ఊపింది. ఆ వ్యక్తికి భార్యగా ఉండటానికి మైనర్ బాలిక అంగీకరిస్తే.. ఆ పెళ్లి చట్టబద్దమే అవుతుందని అభిప్రాయపడింది. మానవతా దృక్పథంతో ఈ వివాహానికి చట్టబద్ధత కల్పిస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.
అసలు విషయమేమిటంటే..
ముంబైకి చెందిన ఓ సీనియర్ న్యాయవాది మొదటి భార్య కన్నుమూశారు. దీనితో ఆయన 2015 ఏప్రిల్ 21వ తేదీన ఓ బాలికను పెళ్లాడారు. పెళ్లి చేసుకునే సమయానికి ఆ బాలిక వయస్సు 14 సంవత్సరాల ఏడు నెలలు. రెండేళ్ల పాటు వారి కాపురం సజావుగా సాగింది. 2017లో వారి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. గృహహింస వేధింపులు అధికం అయ్యాయి. దీనితో ఆ బాలిక తన భర్తపై ముంబైలోని కాలాచౌకీ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు ఆయనపై బాల్య వివాహాల నిరోధక చట్టం-2006 కింద కేసు నమోదు చేశారు. కస్టడీలోకి తీసుకున్నారు. 10 నెలల పాటు ఆ న్యాయవాది పోలీసుల కస్టడీలోనే ఉన్నారు.
రాజీపడ్డ బాలిక..
అనంతరం.. పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో ఆ బాలిక తన భర్త, ఆయన కుటుంబీకులతో రాజీ పడ్డారు. కేసును ఉపసంహరించుకోవడానికి సమ్మతించారు. ఈ వివాదాన్ని సెటిల్ చేసుకున్నారు. తనకు భర్త తోడు కావాలని కోరుతూ మరోసారి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాను కేసును ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, తన భర్తతో కలిసి నివసించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ బాలిక బోంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జస్టిస్ రంజిత్ మోరె, జస్టిస్ భారతి డాంగ్రేలతో కూడిన డివిజన్ బెంచ్.. ఈ పీటీషన్పై విచారణ చేపట్టింది. చాలాకాలం పాటు వాయిదా పడుతూ వచ్చింది ఈ కేసు. చివరికి ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన ఆ బాలిక ఓ అఫిడవిట్ను కూడా దాఖలు చేశారు. తాను భర్తతో ఇష్టపూరకంగా కలిసి నివసిస్తానని, ఇందులో ఎవరి బలవంతం లేదని, ఎవరి ప్రోద్బలం లేదని అంటూ ఆమె ఈ అఫిడవిట్లో పొందు పరిచారు.
తీర్పు వెలువరించే సమయానికి మేజర్..
బోంబే హైకోర్టులో ఈ కేసు పలు వాయిదాలు పడింది. సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగింది. ఈ లోగా ఆ బాలిక మేజర్ అయ్యారు. 18 సంవత్సరాల వయస్సు నిండింది. ఈ నేపథ్యంలో- ఆమె మరో పిటీషన్ను దాఖలు చేశారు. తాను మేజర్ అయ్యానని, స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకోగలుగుతున్నానని స్పష్టం చేశారు. తన భర్తతో కలిసి జీవించడానికి అనుమతి ఇవ్వాలని, కేసును త్వరితగతిన ముగించాలని తాజా పిటీషన్లో విజ్ఞప్తి చేశారు. దీన్ని కూడా స్వీకరించిన డివిజన్ బెంచ్.. రెండు పిటీషన్లను కలిపి విచారించింది.
భవిష్యత్తుకు భరోసా కల్పించడానికే..
56 సంవత్సరాల భర్తతో కలిసి జీవించడానికి భార్య మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నందున.. ఈ వివాహానికి సమ్మతిస్తున్నామని, చట్టబద్ధతను కల్పిస్తున్నామని సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఈ విషయంలో తాము మానవతాదృక్పథాన్ని, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నామని న్యాయమూర్తులు చెప్పారు. భార్యభర్తను విడదీయడం వల్ల ఆమెపై ఒంటరి మహిళ అనే ముద్ర పడుతుందని పేర్కొన్నారు. రెండో పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చని, ఈ పరిస్థితుల్లో ఆమె భవిష్యత్తుకి భరోసా ఇవ్వడం అత్యంత ముఖ్యమని భావించడం వల్లే ఈ పెళ్లికి సమ్మతిస్తున్నామని న్యాయమూర్తులు తెలిపారు.