అలాంటి దారుణాలకు పాల్పడే వారికి మరణశిక్షే కరెక్ట్: బాంబే హైకోర్టు
ముంబై: అత్యాచారం చేసేవారికి ఉరిశిక్షే సరైనదని బాంబే హైకోర్టు వెల్లడించింది. నిర్భయ అత్యాచార ఘటన తర్వాత ఒక నిబంధనకు సంబంధించిన రాజ్యాంగ చెల్లుబాటును సమర్థిస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. అత్యాచార కేసుల్లో పలుమార్లు దోషులుగా తేలిన వారికి ఉరిశిక్షే కరెక్ట్ అని హైకోర్టు అభిప్రాయపడింది.. సంచలనం సృష్టించిన శక్తి మిల్స్ సామూహిక అత్యాచార కేసులో ముగ్గురు దోషులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్ బి.ధర్మాధికారి, జస్టిస్ రేవతి మోహితే దెరేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటన తర్వాత జస్టిస్ జె.ఎస్.వర్మ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఇండియన్ పీనల్ కోడ్లో మార్పులు జరిగాయి. దీనికింద 376(E)పాల్పడేవారికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించాలన్నది దీని సారాంశం. ఈ సెక్షన్ కింద మొట్టమొదటిసారిగా శక్తి మిల్స్ అత్యాచార ఘటనలో కొందరు దోషులుగా తేలారు. 2013 ఆగస్టు 22న విజయ్ జాదవ్, కాశీం బెంగాలీ, సలీం అన్సారీ, సిరాజ్ ఖాన్లు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిని ముంబయిలోని జనసమర్దత లేని ప్రాంతం శక్తి మిల్స్ ప్రాంగణంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి కొన్ని నెలల ముందు వీరు అదే ప్రాంతంలో 18 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశారు. దీంతో పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఐపీసీలోని 376(E) సెక్షన్ కింద జాదవ్, బెంగాలీ, అన్సారీలకు మరణశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. సిరాజ్ ఖాన్కు జీవిత ఖైదు విధించింది. మరో నిందితుడిగా ఉన్న ఓ మైనర్ను సంరక్షణ కేంద్రానికి పంపింది.
ట్రయల్ కోర్టు నిందితులకు మరణశిక్ష విధించడంతో ఐపీసీ సెక్షన్ 376(E) చెల్లుబాటును సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అత్యంత అరుదైన కేసుల్లోనే మరణశిక్ష విధించాలని రాజ్యాంగం చెబుతోందంటూ వారి తరపున వాదించిన న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒకసారి కన్నా ఎక్కువ సార్లు అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష విధించాలంటూ ఈ చట్టం చెబుతోందని దీన్ని సమీక్షించాలని కోరారు. అయితే ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం కాదని కోర్టు వెల్లడించింది. అత్యాచార బాధితులు ఎదుర్కొనే వేదన ఒక్కసారితో పోదని అది జీవితాంతం వారిపై ఉంటుందని కోర్టు తెలిపింది. అంతేకాదు హత్యకన్నా అత్యాచారం మరింత ప్రమాదకరమైనది కోర్టు అభిప్రాయపడింది.