మరాఠా కోటాను సమర్థించిన బాంబే హైకోర్టు...కానీ మెలిక పెట్టింది
ముంబై:ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యలో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్ల యొక్క రాజ్యాంగ ప్రామాణికతను బొంబాయి హైకోర్టు గురువారం సమర్థించింది. అయితే రిజర్వేషన్ కోటా 16శాతం కాకుండా 12 లేదా 13శాతానికి కుదించాలని సూచించింది.రాష్ట్ర వెనకబడిన వర్గాల కమిషన్ చేసిన రికమెండేషన్స్ మేరకు బాంబే హైకోర్టు ఈ సూచనలు చేసింది. ప్రభుత్వం విద్య పరంగా సామాజికంగా వెనకబడిన మరాఠా సామాజిక వర్గం వారికి రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం సరైనదే అంటూ జస్టిస్ రంజిత్ మోర్, భారతీ దంగ్రేలతో కూడిన ద్విసభ్య డివిజెన్ బెంచ్ చెప్పింది.
ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని సమర్థిస్తూనే బాంబే హైకోర్టు ఆ రిజర్వేషన్ శాతం 16 కాకుండా 12 లేదా 13శాతానికి కుదించాలని పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠీ సామాజికవర్గం వారికి 16శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయంపై దాఖలైన పలు పిటిషన్లను విచారణ చేసింది. గతేడాది నవంబర్ 30న మహారాష్ట్ర సర్కార్ అసెంబ్లీలో 16శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పాస్ చేసింది. ప్రస్తుతం మొత్తం మీదఉన్న 52శాతంకు ఇది అదనం. 16శాతం రిజర్వేషన్ చేరడంతో రిజర్వేషన్ల శాతం కాస్త 68శాతానికి చేరింది.
మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై పలువురు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా... మరికొందరు సమర్థిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ వారు సుప్రీం కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ వాదించారు. 50శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం మరోలా వాదించింది. సామాజికంగా వెనకబడిన మరాఠీలకు కొంత ఊరటనిచ్చేందుకే రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం సమర్థించింది.