జయలలిత పార్టీ మీటింగ్ లో బాంబుల కలకలం
మదురై: తమిళనాడులోని మదురైలో మరోసారి బాంబుల కలకలం రేగింది. విషయం తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు. అధికార పార్టీ అన్నా డీఎంకే సమావేశ వేదికలో నాలుగు బాంబులు స్వాధీనం చేసుకున్నామని బుధవారం పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న బాంబులలో రెండు నాటు బాంబులు, రెండు పెట్రోల్ బాంబులు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ముదురైలో అన్నాడీఎంకే పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశం ప్రారంభానికి ముందే రెండు బాంబులు గుర్తించారు. సమావేశం పూర్తి అయిన తరువాత మరో రెండు బాంబులు ఉన్నట్లు కనుగొన్నామని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ సమావేశంలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పార్టీ కార్యకర్తలు, పోలీసు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
తమిళనాడు మంత్రి సెల్లూరు రాజు మదురైలో నివాసం ఉంటున్నారు. ఆదివారం అర్దరాత్రి గుర్తు తెలియని దుండగులు మంత్రి సెల్లూరు రాజు ఇంటి మీద పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
గత కొన్ని రోజులుగా మదురైలోని మదుర మీనాక్షి దేవాలయం సమీపంలో, మరికొన్ని చోట్ల పెట్రోల్ బాంబులు వేసి కలకలం రేపుతున్నారు. మంగళవారం రాత్రి మంత్రి సెల్లూరు రాజు నిర్వహించిన పార్టీ సమావేశంలో నాలుగు బాంబులు కనపడటం ఆందోళనకు గురి చేస్తున్నదని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. ప్రత్యర్థులు తనను అంతం చెయ్యడానికి ఇలా చేస్తున్నారని మంత్రి సెల్లూరు రాజు ఆరోపిస్తున్నారు.