హింసాత్మకంగా కేరళ: కమ్యూనిస్టు ఎమ్మెల్యే ఇంటిపై బాంబులు విసిరిన ఆందోళనకారులు
అయ్యప్ప స్వామి నెలువై ఉన్న చోట రోజురోజుకీ హింస చెలరేగుతోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు జంకుతున్నారు. ఇందుకు కారణం శబరిమలలో పెరుగుతున్న రక్తపాతం. ఇది ఒక్క శబరిమలకే పరిమితం కాలేదు... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఘర్షణలు, అల్లర్లు చెలరేగి పోతుండటంతో ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. తాజాగా సీపీఐఎం నేత తలస్సెరీ ఎమ్మెల్యే ఏఎమ్ షమ్సీర్ ఇంటిపై ఆందోళనకారులు బాంబులు విసరడంతో హింస మరో లెవెల్కు పాకింది.
ప్రస్తుతం కేరళలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవడంతో అక్కడి భక్తులు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే హింస చెలరేగింది. తలసెర్రీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఏఎన్ షమ్సీర్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు రాత్రి 10 గంటల ప్రాంతంలో బాంబులు విసిరినట్లు పోలీసులు తెలిపారు. తన ఇంటిపై బాంబులు వేసిన సమయంలో ఎమ్మెల్యే ఓ శాంతి ర్యాలీలో ఉన్నారు. తన ఇంటిపై జరిగిన దాడి ఘటన ఆర్ఎస్ఎస్ వారు చేసినదే అని షమ్సీర్ ఆరోపించారు. షమ్సీర్ ఇంటితో పాటు మరో కమ్యూనిస్టు నేత కన్నూరు జిల్లా కార్యదర్శి శశి ఇంటిపై కూడా దుండగులు దాడి చేశారు.
ఇదిలా ఉంటే పతనంతిట్ట జిల్లాలోని పండలం, అదూర్, కోడుమన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధాజ్ఞలు మరో ఏడు రోజుల పాటు కొనసాగనున్నాయి. రెండు షాపులతో పాటు మరో ఇద్దరు స్థానిక కమ్యూనిస్టు నేతల ఇళ్లపై కూడా దాడి జరిగింది. ఈ ఘటనలో మొత్తం ఏడు మంది గాయపడ్డారు. జనవరి 2వ తేదీ మధ్యాహ్నం నుంచి కేరళ ఆందోళనలు, నిరసనలు, హింసలతో అట్టుడికిపోతోంది. ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంతో ఇంత రచ్చ జరుగుతోందని పలువురు అయ్యప్ప భక్తులు అభిప్రాయపడుతున్నారు.