శ్రీదేవిది మర్డరా..!! వాట్ ఏ స్టుపిడ్ స్టోరీ, కేరళ పోలీసు బాస్పై బోనికపూర్ చిందులు
ముంబై : అతిలోక సుందరి శ్రీదేవిది సహజ మరణం కాదని కేరళ డీజీపీ చేసిన ఆరోపణలను ఆమె భర్త బోనికపూర్ తోసిపుచ్చారు. సత్యదూరమైన అంశాలను ప్రస్తావించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఊహలలోకంలో విహరిస్తూ .. కట్టుకథలు అల్లితే విశ్వాసం ఉంటుందా అని ప్రశ్నించారు. ఆయనే కాదు తన స్నేహితుడి ప్రస్తావిస్తూ కాలమ్లో కట్టుకథ అల్లడం సరికాదన్నారు. ఇలాంటి పిచ్చిపనులపై తాను స్పందించబోనని స్పష్టంచేశారు బోనికపూర్.
స్టూపిడ్ స్టోరీ
శ్రీదేవిది సహజ మరణం కాదని కేరళ పత్రిక కేరళ కౌముదిలో కేరళ జైళ్ల శాఖ డీజీ రిషిరాజ్ సింగ్ కథనం రాశారు. దీనిపై తీవ్ర దుమారం చెలరేగుతుంది. ఈ క్రమంలో బోనికపూర్ను వివరణ అడుగగా ఆయన ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. 'ఊహల లోకంలో విహరిస్తూ రాసే కట్టు కథలపై స్పందించబోను‘ అని బోనికపూర్ స్పష్టంచేశారు. ఇలా ఒకరి మృతి గురించి అసత్యాలను ప్రచారం చేయడం మంచి పద్దతి కాదన్నారు.
ఇదీ విషయం
గతేడాది ఫిబ్రవరి 24.. అభిమానులకు గుండెకోత మిగిల్చి దివికెగారు అందాల నటి శ్రీదేవి. ఆమె లేరనే వార్త తెలిసి అభిమానులు దిగ్భాంతికి గురయ్యారు. దుబాయ్లో తన కుటుంబానికి చెందిన ఫంక్షన్కెళ్లి చనిపోయారు. బాత్ టబ్లో పడిపోయి మృతిచెందారని యూఏఈ అధికారులు కూడా ధ్రువీకరించారు. అయితే శ్రీదేవి మరణంపై సందేహాలు వెల్లువెత్తాయి. కానీ ఈ అంశంపై విచారణ మాత్రం జరిపించలేకపోయారు. కానీ ఏడాది తర్వాత కేరళ జైళ్లశాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవిది సహజ మరణం కాదని కేరళ పత్రికలో కాలమ్ రాయడంతో కలకలం రేగింది. ఆమె బాత్ టబ్లో పడి చనిపోలేదని స్పష్టంగా పేర్కొన్నారు.
అనుమానాస్పదం
శ్రీదేవి మృతికి సంబంధించి అనుమానం ఉందని తన మిత్రుడు, ఫోరెన్సిక్ ఎక్స్ పర్ట్ డాక్టర్ ఉమదత్తన్ కూడా తనతో చెప్పినట్టు రాయడం ప్రాధాన్యం కలిగించింది. ప్రముఖ నటి హత్య విషయంలో పోలీసు అధికారికే గాక .. ఫోరెన్సిక్ నిపుణుడికి కూడా అనుమానం రావడం చర్చానీయాంశమైంది. దీనిని బట్టి శ్రీదేవిది సహజ మరణం కాదనే అవకాశాలు ఉన్నాయి. శ్రీదేవి చనిపోయాక ఆత్రుతతో ఏం జరిగిందని అడిగితే సహజ మరణం కాదని ఉమదత్తన్ చెప్పారని గుర్తుచేశారు. అంతేకాదు శ్రీదేవి బాట్ టబ్లో పడి ఎలా చనిపోతారని కొన్ని ప్రశ్నలు సంధించారు. బాత్ టబ్లో కేవలం ఒక అడుగు నీటిలో పడితే ఎలా చనిపోతారని ప్రశ్నించారు. అయితే ఎక్కువ మద్యం సేవిస్తే మాత్రం అవకాశం ఉందని పేర్కొన్నారు. లేదంటే కొందరు ఉద్దేశపూర్వకంగా బాత్ టబ్లో ఊపిరాడనీయకుండా చేస్తే తప్ప చనిపోరని గుర్తుచేశారు.