శ్రీదేవి మృతిపై లోతుగా.! బోనీ కపూర్ నిర్బంధం, పాస్పోర్ట్ సీజ్: ఏం జరుగుతోంది?
దుబాయ్: సినీ నటి శ్రీదేవి మృతి చెంది మూడు రోజులైనా స్పష్టత రావడం లేదు. మొదట గుండెపోటుతో శ్రీదేవి మరణించిందని కుటుంబసభ్యులు తెలిపినప్పటికీ.. తాజాగా, దుబాయి ఫోరెన్సిక్ నివేదిక.. ప్రమాదవశాత్తు బాత్రూంలోని నీటి టబ్బులో పడి మృతి చెందిందని తేల్చింది.
ఈ నేపథ్యంలో దుబాయి పోలీసులు కేసు విచారణను ప్రాసిక్యూషన్కు అప్పగించారు. దీంతో శ్రీదేవి మృతదేహాన్ని సోమవారం భారత్కు అప్పగించలేమని దుబాయ్ ఫోరెన్సిక్ అధికారులు తేల్చి చెప్పారు. ఈ కేసులో మరింత విచారణ అవసరమని దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారులు తెలిపారు.
మరింత సమయం
శ్రీదేవి మృతదేహాన్ని భారతదేశానికి తరలించడానికి ఎంత టైమ్ పడుతుందో తెలియడం లేదని భారత రాయబారి తెలిపారు. దుబాయి అధికారుల నుంచి మరికొన్ని అనుమతులు రావాల్సి ఉందని ఆయన తెలిపారు.
బోనీ కపూర్ పాస్ పోర్ట్ సీజ్
కాగా, ఇప్పటికీ శ్రీదేవి భర్త బోనీ కపూర్ హోటల్ గదిలోనే ఉన్నారు. కేసు కొలిక్కి వచ్చే వరకూ దుబాయి విడిచివెళ్లొద్దని పోలీసులు ఆయనకు సూచించారు. అంతేగాక, బోనీ కపూర్ పాస్ పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే బోనీ కపూర్ను పోలీసులు, అధికారులు మూడు గంటపాలపాటు సుదీర్ఘ విచారణ జరిపిన విషయం తెలిసిందే.
శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించలేం: షాకిచ్చిన ఫోరెన్సిక్, ‘మద్యం'పై అనుమానం
చర్చనీయాంశంగా విచారణ
గత శనివారం రాత్రి ప్రమాదవశాత్తూ హోటల్గదిలోని బాత్టబ్లో మునిగి శ్రీదేవి మృతి చెందారని యూఏఈ ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడించిన తర్వాత దుబాయ్ పోలీసులు, ప్రాసిక్యూషన్ మరింత లోతుగా కేసు దర్యాప్తు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
సిద్ధి వినాయక ఆలయంలో వేదనగా, కంటతడి, తెలుగువారంటే..: ‘ఆలస్యం'పై ఫ్యాన్స్ అసహనం
ఏం జరుగుతోంది..
ఓ వైపు శ్రీదేవి భౌతికకాయం కోసం అభిమానులు ముంబైలో ఎదురుచూస్తుండగా... మరో వైపు దుబాయ్లో జరుగుతున్న పరిణామాలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. శ్రీదేవి భౌతికకాయం తరలింపుపై సోమవారం ఉదయం నుంచి గంట గంటకు మారుతున్న పరిణామాలు అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. అసలు దుబాయిలో ఏం జరుగుతోందనే ఆందోళనలో అభిమానులు ఉన్నారు.
బోనీ కపూర్ను ఎందుకు అనుమానిస్తున్నారు?
శ్రీదేవి మరణానికి ముందు ఆమె బసచేసిన హోటల్ గదిలో ఏం జరిగిందనే విషయంపై అందరూ ఆరాతీస్తున్నారు. ప్రమాదవశాత్తూ ఘటన జరిగితే.. దుబాయ్ పోలీసులు బోనీకపూర్ను ఎందుకు అనుమానిస్తున్నారనేది అంతుబట్టని విషయంగా మారింది. శ్రీదేవి బస చేసిన హోటల్ గదిని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఫిర్యాదు చేయనప్పటికీ..
శ్రీదేవి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకూ దుబాయ్ పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ.. అక్కడి అధికారులు మాత్రం లోతుగా దర్యాప్తు చేయడం వెనుక బలమైన కారణం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సోమవారం రాత్రి వరకు శ్రీదేవి మృతదేహం వస్తుందని టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే ముంబై చేరుకున్నారు. శ్రీదేవి కూతురు జాహ్నవి, అనిల్ కపూర్లను వారు పరామర్శిస్తున్నారు.