సర్వేలు సరే.. ఐదు రాష్ట్రాల్లో బుకీల జోస్యం ఏమిటి? తెలంగాణలో కేసీఆరే కానీ.. తారుమారు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోను ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలో బీజేపీ మూడు పర్యాయాలు అధికారంలో ఉంది. దీంతో ప్రజా వ్యతిరేకత సహజమని చెబుతున్నారు. రాజస్థాన్లో అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది.
ఈ నేపథ్యంలో పలు సర్వేలు రాజస్థాన్లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్లో పోటాపోటీ, చత్తీస్గఢ్లో బీజేపీ, అధికారంలోకి వస్తాయని ఎక్కువ సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో తెరాస వస్తుందని కొందరు భావిస్తుంటే, మహాకూటమి వస్తుందని మరికొందరు చెబుతున్నారు. సర్వేలు, ప్రజల అభిప్రాయాలను పక్కన పెడితే బుకీలు ఏమనుకుంటున్నారనేది కూడా ఆసక్తికరమే.
ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారంటే?
బుకీలు కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై భిన్నంగా ఉన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, చత్తీస్గఢ్లో బీజేపీ వస్తుందని, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (కేసీఆర్) అధికారంలోకి వస్తారని బుకీలు భావిస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణలో కేసీఆర్
మధ్యప్రదేశ్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బుకీలు భావిస్తున్నారని తెలుస్తోంది. చత్తీస్గడ్లో మాత్రం రమణ్ సింగ్ ప్రభుత్వం మంచి మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. ఇక రాజస్థాన్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో అధికారం చేజిక్కించుకుంటుందని భావిస్తున్నారు. తెలంగాణలో అధికార తెరాస తిరిగి వస్తుందని భావిస్తున్నారు.
భారీగా బెట్టింగులు
చత్తీస్గడ్లో బీజేపీ గెలుపుపై ప్రతి రూపాయికి 90 పైసలు బెట్టింగ్ కడుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పైన రూ.1.40 పైసలు కడుతున్నారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ 112 నుంచి 116 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 100 నుంచి 102 సీట్లు గెలుస్తుందని బుకీలు భావిస్తున్నారట. రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ గెలుపుపై అనుమానాం కారణంగా ఎక్కువ పెట్టారని, ఇప్పుడు అలా లేదని చెబుతున్నారట.
తెలంగాణలో పదిహేను రోజుల్లో తారుమారు
రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి 132 నుంచి 134 సీట్లు, బీజేపీకి 55 నుంచి 57 సీట్లు వస్తాయని భావిస్తున్నారట. చత్తీస్గఢ్లో బీజేపీకి 42 నుంచి 43 వరకు, కాంగ్రెస్ పార్టీ నుంచి 36 నుంచి 37 సీట్ల మధ్య వస్తాయని బుకీలు భావిస్తున్నారట. ఇక తెలంగాణలో మాత్రం తొలుత కేసీఆర్ వైపే మొగ్గు ఉందని, కానీ గత పదిహేను రోజులుగా పరిణామాలు మారుతున్నాయని బుకీలు చెబుతున్నారట. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి పుంజుకుంటుందని భావిస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణలో తెరాస వస్తుందని బుకీలు భావిస్తున్నారని తెలుస్తోంది.