బోరా షీనా హత్య కేసు: పీటర్ ముఖర్జీకి బెయిల్ మంజూరు చేస్తూనే ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
ముంబై: దేశవ్యాప్తంగా షీనా బోరా హత్యకేసులో నిందితుడు పీటర్ ముఖర్జీకి బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అయితే మంజూరు అయ్యిందికానీ జైలు నుంచి విడుదల కాలేరు. హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూనే మరో ఆరువారాల పాటు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఈ సమయంలో సుప్రీంకోర్టును ప్రాసిక్యూషన్ ఆశ్రయించొచ్చని పేర్కొంది. ఇదిలా ఉంటే షీనాబోరా హత్య కేసులో ప్రాథమిక విచారణ సందర్భంగా పీటర్ ముఖర్జీ పై ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. పీటర్ ముఖర్జీ నాలుగేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు.
కేసులో వాదనలు విన్న తర్వాత, పీటర్ ముఖర్జీ మెడికల్ కండిషన్ దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయడం జరుగుతోందని న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. అదే సమయంలో కోర్టు 2 లక్షలు పూచీకత్తుగా కట్టాలని ఆదేశించింది. అంతేకాదు తన పిల్లలు రాహుల్ ,విధిలను కూడా కలిసేందుకు వీలు లేదని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రానీ ముఖర్జీకి మాజీ భర్త పీటర్ ముఖర్జీ. వీరిద్దరికి పుట్టిన బిడ్డ షీనా బోరా. షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జీ పై కూడా ఆరోపణలు రావడంతో ఆయన్ను అరెస్టు చేయడం జరిగింది. షీనా బోరాను పీటర్ ముఖర్జీ చాలా సైలెంట్గా హత్య చేశారని సీబీఐ ముంబై కోర్టుకు గతేడాది మార్చిలో తెలిపింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో సీబీఐ కోర్టులో ఈ విషయాన్ని వెల్లడించింది. 2015లో పీటర్ ముఖర్జీ అరెస్టు అయ్యాడు. అనంతరం గతేడాది నవంబర్లో సీబీఐ జడ్జి జేసీ జగ్దలే ముందు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే హత్య కేసులో రుజువులున్నాయని ఇప్పుడే అతనికి బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ సీబీఐ తరపున లాయర్ వాదనలు వినిపించారు.
షీనా బోరా హత్యకు గురైన సమయంలో తాను భారత్లో లేననే వాదనలు వినిపించాడు పీటర్ ముఖర్జీ. అయితే ముంబైలో 26/11 ఉగ్రదాడులు జరిగిన సమయంలో హఫీజ్ సయీద్ కూడా పాకిస్తాన్లో ఉన్నాడని అంతమాత్రాన ఆ కేసులో కీలక నిందితుడు కాలేకుండా పోడని చెబుతూ సీబీఐ లాయర్ కౌంటర్ ఇచ్చారు. ఆ సమయంలో పీటర్ ముఖర్జీ లండన్లో ఉన్నప్పటికీ షీనా బోరా హత్యకేసులో ఆయన హస్తం ఉందని సీబీఐ లాయర్ వాదించారు.