భారత్-చైనా బోర్డర్ ఇష్యూ... ఈ ఒక్కరోజే మూడు కీలక సమావేశాలు... మరోసారి రంగంలోకి దోవల్..
భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న గాల్వన్ వ్యాలీలో జూన్ 15న తలెత్తిన ఘర్షణల తర్వాత శాంతి పరిరక్షణ కోసం ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గాల్వన్,పాంగోంగ్ ప్రాంతాల నుంచి ఇరు దేశాలు తమ సైన్యాలను ఉపసంహరించుకునేందుకు కుదిరిన అవగాహన మేరకు ఆ ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. ఇందులో భాగంగా గురువారం(జూలై 9) ఇరు దేశాలు పాంగోంగ్ సరస్సు ప్రాంతం నుంచి సైన్యాలను వెనక్కి రప్పించాయి.
నేడు చైనాతో అజిత్ దోవల్ మరోసారి...
ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన మేరకు తూర్పు లదాఖ్లోని గోగ్రా,హాట్ స్ప్రింగ్స్ నుంచి చైనా తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంది. శుక్రవారం(జూలై 9) ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సమావేశం జరగడానికి ముందే చైనా తమ సైన్యాన్ని వెనక్కి రప్పించడం గమనార్హం. ఇప్పటివరకు తెలియవస్తున్న సమాచారం ప్రకారం... చైనాతో దౌత్య సంప్రదింపులకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేత్రుత్వం వహించనున్నారు. గత ఆదివారం ఆయన చైనా విదేశాంగ మంత్రితో దాదాపు 2 గంటలు ఫోన్లో సంభాషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎట్టకేలకు ఫింగర్ 4 పాయింట్ నుంచి చైనా సైన్యం సుమారు కిలోమీటరున్నర దూరం వరకు వెనక్కి వెళ్లింది.
నవీన్ శ్రీవాస్తవ నేత్రుత్వంలో విదేశాంగ సమావేశం...
మరోవైపు భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై ఇరు దేశాల విదేశాంగ శాఖల మధ్య కూడా శుక్రవారమే(జూలై 10) సమావేశం జరగనుంది. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఇరు దేశాల మధ్య విదేశాంగ సమావేశం ఇది రెండోసారి కావడం గమనార్హం. భారత్ తరుపున ఈ సమావేశంలో పాల్గొనే బృందానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ తరుపున,ఈస్ట్ ఏసియా జాయింట్ సెక్రటరీ నవీన్ శ్రీవాస్తవ నేత్రుత్వం వహిస్తారు. చైనా తరుపున డైరెక్టర్ జనరల్,డిపార్ట్మెంట్ ఆఫ్ బౌండరీ&ఓసియన్ ఎఫైర్స్,చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వు జియాంగావో నేత్రుత్వం వహిస్తారు.
త్రివిధ దళాధిపతులు,మహాదళపతితో రాజ్నాథ్ భేటీ...
అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా శుక్రవారం మధ్యాహ్నం 12.30గంటలకు చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్,త్రివిధ దళాధిపతులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా చైనా సరిహద్దులో గ్రౌండ్ జీరో పరిస్థితులపై చర్చిస్తారు. ముఖ్యంగా తూర్పు లదాఖ్లోని పాంగోంగ్ సరస్సు ప్రాంతం నుంచి సైన్యాల ఉపసంహరణపై చర్చిస్తారు. ఇప్పటికే దీనిపై మూడుసార్లు కమాండర్ స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. మున్ముందు మరిన్ని చర్చలు అవరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
Recommended Video
చైనా స్టేట్మెంట్...
జూన్ 30న ఇరు దేశాల మధ్య మిలటరీ స్థాయిలో జరిగిన చర్చల ఫలితంగా సైన్యం ఉపసంహరణకు ఒక అవగాహన కుదిరింది. సైన్యం ఉపసంహరింపుకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ను కూడా తయారుచేశారు. ఈ మేరకు చైనా ఆ ప్రక్రియను అనుసరిస్తోందని... అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోందని ఆ దేశం స్పష్టం చేసింది. తూర్పు లదాఖ్లో సైన్యం ఉపసంహరణ ప్రక్రియ నిలకడగా,మెరుగ్గా కొనసాగుతోందని తెలిపింది.