కొత్త రంగుతో మెరవనున్న భారత రైల్వే బోగీలు
న్యూఢిల్లీ: త్వరలో రైల్వే బోగీలు కొత్త రంగును సంతరించుకోనున్నాయి. ఇప్పటి వరకూ ముదురు నీలం రంగులో కనిపించిన కోచ్లకు మెరుగులుదిద్దుతున్నారు.
లేత గోధుమ, గోధుమ రంగుల్లో బోగీలు మెరవనున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ-పఠాన్ కోట్ ఎక్స్ప్రెస్లోని 16బోగీలకు కొత్త రంగులను వేశారు. ఈ రైలు జూన్ చివరినాటికి పట్టాలెక్కనుంది.
సుమారు 30వేల బోగీలకు ఈ కొత్త రంగులు వేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే, అన్ని రైళ్ల రంగులను మార్చడం లేదని తెలిపారు. రాజధాని, శతాబ్ధి, దురంతో, ఇతర ప్రత్యేక సర్వీసులకు ఈ కొత్త రంగులు వేయడం లేదని.. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన మెయిల్/ఎక్స్ప్రెస్ సర్వీసుల కోచ్లకు మాత్రమే ఈ కొత్త రంగులను వేయనున్నామని తెలిపారు.
రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అనుమతి ఇవ్వడంతో కొత్త రంగుల పథకాన్ని అమలు చేస్తున్నామని రైల్వే అధికారి తెలిపారు. రైల్వే బోగీల్లో ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులను అందించడానికి రైల్వే శాఖ కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా బయో టాయిలెట్లు, సౌకర్యవంతమైన సీట్లు, ప్రతి బెర్తుకు మొబైల్ ఛార్జర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, దాదాపు రెండు దశాబ్దాల అనంతరం రైలు బోగీల రంగులను మారుస్తున్నారు. గతంలో ఇటుక ఎరుపు రంగులో బోగీలు ఉంటే వాటికి ముదురు నీలం రంగు వేశారు.