ఓ మహిళా ఉద్యోగి ఆవేదన: వయాగ్రా మాత్ర ఇచ్చాడు
బెంగుళూరు: తలనొప్పిగా ఉందని చెబితే వయాగ్రా మాత్ర ఇచ్చిన బాస్పై 22 ఏళ్ల మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన బెంగుళూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే, జలహళ్లిలోని ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలో ఏడాది కాలం నుంచి ఇంచారా (పేరు మార్చాం) అనే మహిళ డేటా ప్రాసెసర్గా పనిచేస్తోంది.
తనకు తలనొప్పిగా ఉందని, మెడిసిన్ కొనుక్కునేందుకు బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన ఆ మహిళా ఉద్యోగికి బాస్ మల్లప్ప (38) వయాగ్రా మాత్ర ఇచ్చాడు. అంతేకాదు గత మూడు నెలలుగా ఆమెను మేనేజర్ మల్లప్ప వేధిస్తున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
ఆఫీసులో ఎవరూ లేనప్పుడు తన చున్నీ లాగడం, అసభ్యంగా తన శరీరాన్ని తాకడం లాంటి పనులు చేస్తున్నాడని పీన్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు వాపోయింది. తన తండ్రి మరణించిన నాటి నుంచి పెళ్లి చేసుకుంటానని తనవెంట పడుతున్నాడని పేర్కొంది.
మల్లప్ప ఇలా ప్రవర్తించడానికి కారణం అతని భార్య యుఎస్లో ఉండటమేనని పేర్కొంది. 'నేను నిస్సాయస్ధితిలో ఉన్నాను. గత కొన్ని నెలలుగా మల్లప్ప వేధింపులను మౌనంగా భరిస్తున్నాను. అతను మేనేజర్ కనుక అతడి వేధింపుల గురించి చెప్పినా ఎవరూ నమ్మరు.' అని బాధితురాలు ఆవేదనతో చెప్పింది.
అంతేకాదు అతనికి వ్యతిరేకంగా కేసు పెడితే తన ఉద్యోగం కూడా పోతుందన్న భయం కూడా ఉందన్నారు. చాలాసార్లు లైంగికంగా కూడా తనతో కలవాలని బలవంతం చేశాడని బాధిత మహిళ పేర్కొంది. పైచదువులకు ఆర్థిక సహాయం చేస్తానని, మంచి ఉద్యోగం ఇప్పిస్తామని పలుమార్లు మల్లప్ప ఆఫర్ చేసినా తిరస్కరించానని బాధితురాలు వెల్లడించింది.