గాడ్సే - మోడీ ఇద్దరి భావజాలం ఒక్కటే: ప్రధాని పై విరుచుకుపడ్డ రాహుల్ ఏమన్నారంటే..?
వాయనాడ్: జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే ప్రధాని నరేంద్రమోడీ ఇద్దరిదీ ఒకే భావజాలమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ తన నియోజకవర్గం వాయనాడ్లో పర్యటిస్తున్నారు. తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాహుల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ వాది అయిన గాడ్సే మహాత్మా గాంధీని చంపాడని తను చేస్తున్నదేంటో తనకు తెలుసు కాబట్టే అది తప్పుకాదని గాడ్సే భావించి ఉంటాడని రాహుల్ అన్నారు. మోడీకి గాడ్సేకు మధ్య చిన్నపాటి తేడా ఉందని చెప్పిన రాహుల్... గాంధీని గాడ్సేనే చంపాడని తెలిసి కూడా ఈ నిజాన్ని ఒప్పుకునేందుకు ప్రధాని మోడీకి ధైర్యం దమ్ము లేదన్నారు. 30 జనవరి 1948లో గాడ్సే గాంధీ శరీరంలోకి పాయింట్ బ్లాంక్ నుంచి మూడు తూటాలు దింపాడు. 1948లో గాడ్సేను ఉరితీయడం జరిగింది.
మహాత్మాగాంధీ 72వ వర్థంతి సందర్భంగా దేశం యావత్తు మహాత్ముడికి నివాళులు అర్పిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. వాయనాడ్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిర్వహించిన మార్చ్కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాయకత్వం వహించారు. " రాజ్యాంగాన్ని పరిరక్షించండి" అనేపేరుతో రాహుల్ గాంధీ నియోజకవర్గం వాయనాడ్లో నిరసన కార్యక్రమంను నిర్వహించారు. వందలాదిగా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండాలు, జాతీయ జెండాలతో రెండు కిలోమీటర్ల మేరా జరిగిన మార్చ్లో పాల్గొన్నారు.
వాయనాడ్లోని ఎస్కేఎంజే హైస్కూలు నుంచి ఈ మార్చ్ ప్రారంభమైంది. తను భారత పౌరుడని చెప్పేందుకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. ఇక ర్యాలీలో ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల, కేరళ పీసీసీ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్, ఏఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ బుధవారం రాత్రే వాయనాడ్కు చేరుకున్నారు. ర్యాలీ తర్వాత రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు.
ఎప్పు సత్యాన్ని శోధించే మహాత్ముడంటే నాథూరాం గాడ్సేకు ద్వేషమని చెప్పిన రాహుల్ గాంధీ... అందుకే ఆయన్ను హత్య చేశాడని చెప్పారు. మహాత్ముడిని చంపిన నాథూరాం గాడ్సేను ఎంపీ ప్రగ్యా ఠాకూర్ గతేడాది సమర్థించడంతో ఈ విషయం వివాదాస్పదంగా మారింది. కమల్ హాసన్ కూడా గాడ్సేపై పలు వ్యాఖ్యలు చేయడంతో గతేడాది వీరి కామెంట్స్పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.