వారిద్దరి కెమిస్ట్రీకి అదే నిదర్శనం..!మోదీ చెప్పగానే ఠకీమని అమలు చేసిన అమిత్ షా..!!
ఢిల్లీ/హైదరాబాద్ : రాజకీయాల్లో కొంత మంది ప్రముఖులకు ప్రత్యేక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ను సహచర స్నేహితులు ఇట్టే అర్ధం చేసుకుంటారు. ఇక రాజకీయల్లో మాత్రం ఈ పరిణామం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. గతంలో ఇలాంటీ నాయకుల జోడీలు అనేకం ఉన్నా ప్రస్తుత రాజకీయాల్లో మోదీ,షాల ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కనుసైగలతో కాకుండా కంటి చూపుతో మాట్లాడుకునే నైపుణ్యం కూడా విరిద్దరికుందనే అంశంపై నిత్యం చర్చ జరుగుతుంటుంది.
ఇదే అంశం తాజాగా రుజువయ్యింది కూడా. ముఖ్యంగా రెండో సారి బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ, హోంమంత్రి అమీత్ షా తీసుకున్న సంచలన నిర్ణయాలు యావత్ దేశ ప్రజలకు తెలిసినవే. ప్రస్తుతం కరోనా వైరస్ ను కట్టడి చేసేందు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను కొనసాగిస్తున్నారు. సరిగ్గా ఇదే క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయింది.
చితికి పోయిన దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్లీ గాడినపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోదీ. అందులో భాగంగా ప్రధాని మోదీ స్వదేశీ వస్తువుల వాడకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ప్రధాని మోదీ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రధాని మోదీ సందేశానికి వెంటనే అమిత్ షా స్పందించినట్టు తెలుస్తోంది. ఇకపై స్వదేశీ వస్తువులను ప్రోత్సహించేలా కార్యచరణ రూపొందించారు షా.
జూన్ 1వ తేదీ నుంచి దేశంలోని అన్ని కేంద్ర బలగాలకు సంబంధించిన క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే అమ్మాలంటూ అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 10 లక్షల మంది సైనికులు భారత్ లో తయారైన సొంత ఉత్పత్తులను వాడనున్నారు. ప్రతి ఏటా వీరు దాదాపు 2800 కోట్ల రూపాయల వ్యాపారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజలంతా స్వదేశీ వస్తువులను కొనడం వల్ల రాబోయే ఐదేళ్లలో వాస్తవంగా ఆత్మ నిర్భర్ భారత్ అవుతుందంటూ అమిత్ షా ట్వీట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.