కాంగ్రెస్, బీజేపీ రెండూ హింస ప్రేరేపిత పార్టీలే..! పెహ్లూ ఖాన్ హత్యపై మండి పడ్డ ఒవైసీ..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపిలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రెండు పార్టీల పై ఘాటు విమర్శలు చేసారు ఓవైసీ. భారత దేశాన్ని ఏళ్ల తరబడి పాలిస్తున్న ఈ రెండు పార్టీలు హింసను ప్రేరేపించడం మాత్రం మానుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అదికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా దాడులు జరిగితే బీజేపి కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గోరక్షకుల చేతిలో మూకహత్యకు గురైన పెహ్లూ ఖాన్పై రాజస్థాన్ పోలీసులు చార్జిషీటు దాఖలు చేయడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణికి ఇది ప్రత్యక్ష నిదర్శనమంటూ ఆయన విరుచుకుపడ్డారు. 'అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పెహ్లూ ఖాన్పై దాడి జరిగినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఖండించింది. రాజస్థాన్ ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వొద్దు. అది మిమ్మల్ని ఎప్పుడూ మోసగిస్తూనే ఉంటుంది అని ఒవైసీ పేర్కొన్నారు.
Recommended Video
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడెల్లా బీజేపీ మాదిరిగానే వ్యవహరిస్తుందనీ... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మొసలి కన్నీరు కార్చుతుందంటూ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. కాగా ఇవాళ ఉదయం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. 'ఈ కేసు విచారణ బీజేపీ హయాంలో మొదలైంది. చార్జిషీటు ఇప్పుడు దాఖలు చేశారు. విచారణలో ఏదైనా తేడా జరిగినట్టు గుర్తిస్తే.. మళ్లీ ఈ కేసు తిరగదోడతాం..' అని పేర్కొన్నారు. 2017లో అళ్వార్లో పాడి రైతు పెహ్లూ ఖాన్, అతడి ఇద్దరు కుమారులపై గోరక్షకులు మూకదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. బాధితులు తమ ఆవులను తరలిస్తుండగా.. గోవులను అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ మూకదాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన పెహ్లూ ఖాన్ చికిత్స పొందుతూ రెండ్రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. ఐతే జరిగిన సంఘటనకు ఇరు పార్టీలు సమాధానం చెప్పాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేసారు.