స్మశానంలో ఓ బాక్స్... అందులోది చూసి అందరూ షాక్!
ఆటో డ్రైవర్ ఇస్తున్నది క్యాష్ బాక్స్ అని తెలియని పోలీసులు కూడా ఆ బాక్స్ పట్ల పెద్దగా ఉత్సాహం చూపించలేదు.
బెంగళూరు: నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఈ చిల్లర కష్టాలే ఓ ఇంటి దొంగ గుట్టుని రట్టు చేశాయి. విషయంలోకి వెళితే.. బెంగళూరులోని ఓ ఏటీఎంలో డబ్బు నింపేందుకు హుస్సేన్ అనే వ్యాన్ డ్రైవర్ బయలుదేరాడు.
అయితే మార్గం మధ్యలో అతడి బుద్ధి పెడదారి పట్టింది. ఎలాగైనా ఆ డబ్బును తస్కరించాలన్న ఉద్దేశంతో వ్యాన్ ను దారి మళ్ళించాడు. నిర్మానుష్య ప్రాంతంలో వ్యాన్ ను నిలిపివేసి, అందులోని క్యాష్ బాక్స్ ను తీసుకుని ఆటోలో బెల్లందూరుకు బయలుదేరాడు.
మార్గం మధ్యలో పోలీసు తనిఖీ జరుగుతుండడం గమనించగానే హుస్సేన్ మనసులో ఆందోళన మొదలైంది. క్యాష్ బాక్స్ తో పోలీసుల కంట పడితే తన పని ఆఖరే అని గ్రహించిన హుస్సేన్ మెల్లగా ఆటో దిగి క్యాష్ బాక్స్ తో ఉడాయించేందుకు ప్రయత్నించాడు.
ఇది గమనించిన ఆటో డ్రైవర్ 'డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నావేంటి..?' అంటూ హుస్సేన్ ను నిలదీశాడు. రూ.50 ఇస్తేగాని కదలనివ్వనంటూ అతడి చేతిలో ఉన్న క్యాష్ బాక్స్ ను లాగేసుకున్నాడు. నిజానికి అది క్యాష్ బాక్స్ అనిగాని, అందులో కట్టల కట్టల డబ్బు ఉందనిగాని ఆ ఆటోడ్రైవర్ కు తెలియదు.
తీరా చూస్తే హుస్సేన్ దగ్గర చిల్లర లేదు, కేవలం రూ.2 వేల నోటు మాత్రమే ఉంది. ఆ నోటు ఇస్తే తీసుకోవడానికి ఆటోడ్రైవర్ నిరాకరించాడు. పోనీ రూ.2 వేల నోటు మార్చుదామా అంటే.. చుట్టుపక్కల ఏ దుకాణాలూ కానరాలేదు.
తనకు రూ.50 ఇస్తేనేగాని క్యాష్ బాక్స్ ఇవ్వనంటూ ఆటోడ్రైవర్ మంకుపట్టు పట్టడంతో హుస్సేన్ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. మరోవైపు తనిఖీ చేస్తున్న పోలీసులు వరుసగా ఒక్కో వాహనం చూసుకుంటూ ఆటోను సమీపిస్తుండడం గమనించిన అతడు 'ఇప్పుడే చిల్లర తీసుకుని వస్తా..' అని ఆటోడ్రైవర్ కి చెప్పి అక్కడి నుంచి ఉడాయించాడు.
ఎంతకీ హుస్సేన్ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆటో డ్రైవర్ నేరుగా పోలీసుల వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించి హుస్సేన్ వద్ద నుంచి తాను లాక్కున్న బాక్స్ ను వారికి ఇచ్చేందుకు ప్రయత్నించగా అది క్యాష్ బాక్స్ అని తెలియని పోలీసులు కూడా ఆ బాక్స్ పట్ల పెద్దగా ఉత్సాహం చూపించలేదు.
పోలీసులు కూడా పెద్దగా ఆసక్తి కనబరచక, 'ఆ పక్కన పడేసి వెళ్ళు..' అనడంతో ఆటో డ్రైవర్ హుస్సేన్ ను మనసులోనే తిట్టుకుంటూ చేతిలోని క్యాష్ బాక్స్ ను ఆ పక్కనే ఉన్న స్మశానం కాంపౌండ్ లోకి విసిరేసి తనదారిన తాను వెళ్ళిపోయాడు.
అలా ఏటీఎంలో పెట్టవలసిన క్యాష్ ఆ బాక్స్ లో రాత్రంతా ఆ స్మశానంలో ఉండిపోయింది. తెల్లవారిన తరువాత అటుగా వెళ్ళిన కొంతమంది దానిని చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించగా, రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాక్స్ ను స్వాధీనం చేసుకుని తెరిచి చూస్తే.. షాక్! అందులో కొత్తనోట్ల కట్టలు పేర్చి ఉన్నాయి.
రూ.5.4 కోట్లు చెల్లించు: ఆఫీస్ బాయ్కి ఐటీ నోటీసులు
ఇంకేముంది? తీగ లాగితే డొంకంతా కదిలింది. అక్కడికి కొంత దూరంలో జనసంచారం లేని ప్రదేశంలో హుస్సేన్ విడిచి వెళ్ళిన వ్యాన్ ను గమనించిన పోలీసులు నెంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు మొదలెట్టడంతో మొత్తం కహానీ బయటపడింది.
మొత్తానికి చిల్లర దొరకని రూ.2 వేల నోటు క్యాష్ బాక్స్ తో ఉడాయించేందుకు ప్రయత్నించిన ఇంటిదొంగను ఈ విధంగా పట్టిచ్చింది.