ల్యాప్ టాప్ కోసం రూ. లక్ష చోరీ చేసిన విద్యార్థి
తిరువనంతపురం: ల్యాప్ టాప్ మీద ఉన్న వ్యామోహంతో ఇంటిలో ఉన్న రూ. ఒక లక్ష చోరీ చేసిన విద్యార్థి షికార్లుకు వెళ్లిన సంఘటన కేరళలో జరిగింది. కేరళలోని కోజీకోడ్ జిల్లా కొండాట్టి ప్రాంతానికి చెందిన 7వ తరగతి విద్యార్థిని అతని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.
కొండాట్టి ప్రాంతంలో పీడబ్లూడీ ఇంజనీరు నివాసం ఉంటున్నారు. ఇతనికి 12 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. బాలుడు స్థానిక స్కూల్ లో 7వ తరగతి చదువుతున్నాడు. చాల కాలం నుండి బాలుడు తనకు ల్యాప్ టాప్ కావాలని కుటుంబ సభ్యలను అడుగుతున్నాడు.
అయితే ల్యాప్ టాప్ తీసివ్వడానికి అతని కుటుంబ సభ్యలు నిరాకరించారు. మొదట నీవు బాగ చదువు తరువాత తీసిస్తాం అని నచ్చచెప్పారు. అయితే మే 30వ తేదిన బాలుడు కుటుంబ సభ్యుల కళ్లు గప్పి ఇంటిలోని బీరువాలో ఉన్న రూ. ఒక లక్ష చోరీ చేశాడు.
తాను ఫుట్ బాల్ మ్యాచ్ చూడటానికి వెళుతున్నానని తల్లికి చెప్పి ఇంటి నుండి వెళ్లి పోయాడు. తరువాత నగరంలోని ఒక షోరూంలో రూ. 30 వేల విలువైన ల్యాప్ టాప్ తీసుకున్నాడు. తరువాత రూ. 70 వేలు జేబులో పెట్టుకుని పలు ప్రాంతాలు సంచరించడానికి బయలుదేరాడు.
మే 31వ తేదిన కోచ్చి నుండి బెంగళూరు వెళుతున్న కేఎస్ఆర్ టీసీ బస్సు ఎక్కాడు. ఆ బస్సు మహిళ కండెక్టర్ కు బాలుడి మీద అనుమానం వచ్చింది. బాలుడు ఇంటి నుండి పారిపోయి వచ్చాడని పసిగట్టింది. వెంటనే సమీపంలోని కరుంగపల్లి పోలీస్ స్టేషన్ లో బాలుడిని అప్పగించారు.
బాలుడి నుండి వివరాలు సేకరించిన పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతని కుటుంబ సభ్యలు పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ల్యాప్ టాప్ ఉపయోగించే వయస్సు కాదని తీసివ్వలేదని, తన కుమారుడు ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదని ఇంజనీరు విచారం వ్యక్తం చేశారు.