వరదల్లో కొట్టుకుపోయిన సర్టిఫికెట్లు, కేరళ యువకుడి ఆత్మహత్య, కొత్త యూనీఫాం!
తిరువనంతపురం: కేరళలో దారుణం జరిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా సర్టిఫికెట్లు నీటిలో కొట్టుకుపోవడంతో జీర్ణించుకోలేని ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు ఇక పై చదువులు చదవే అవకాశం లేదని ఆ యువకుడు తీసుకున్న నిర్ణయంతో అతని కుటుంబం విషాదం మిగిలింది.
కేరళలోని కోళికూడ్ జిల్లాలోని కరంతూర్ ప్రాంతంలో కైలాష్ (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఇంటర్ పాస్ అయ్యాడు. ఇటీవలే ఓ కాలేజ్ లో ఐటీఐలో చేరాడు. కాలేజ్ కు వెళ్లడానికి కొత్త యూనీఫాం తెచ్చుకున్నాడు. పై చదువుల కోసం కొంచెం డబ్బు సమకూర్చుకున్నాడు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కైలాష్ నివాసం ఉంటున్న ప్రాంతం జలమయం అయ్యింది. కైలాష్ కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిభిరానికి వెళ్లారు.
ఆదివారం సాయంత్రం వరద నీరు ఆ ప్రాంతంలో తగ్గుముఖం పట్టడంతో కైలాస్ ఇంటికి వెళ్లాడు. ఇంటిలో ఉన్న తన సర్టిఫికెట్లు కైలాష్ పరిశీలించాడు. సర్టిఫికెట్లు అన్నీ వరద నీటిలో కొట్టుకుని వెళ్లాయని తెలుసుకున్న కైలాష్ కుమిలిపోయాడు.
కుటుంబ సభ్యులు కైలాష్ ను ఓదార్చి మళ్లీ సర్టిఫికెట్లు తీసుకోవచ్చు అని నచ్చచెప్పారు. అయితే రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత కైలాష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం విషయం తెలుసుకున్న కున్నమంగళం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.