బాల్ కోసం గోడ దూకిన బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
లక్నో : ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. క్రికెట్ ఆడుతుండగా బాల్ ఓ ఇంట్లో పడటంతో దాన్ని తెచ్చేందుకు గోడ దూకిన అబ్బాయిపై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో టీనేజర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు.
లక్నోలోని గోరఖ్నాథ్ ప్రాంతానికి చెందిన 17ఏళ్ల అరవింద్ కుమార్ ఇంటికి సమీపంలో ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఇంతలో బాల్ దగ్గరలోని ఓ బిల్డింగ్ గోడ లోపల పడింది. దాన్ని తీసుకువచ్చేందుకు వెళ్లిన అరవింద్ బిల్డింగ్ గోడ దూకాడు. ఇది గమనించిన ఇంటి సెక్యూరిటీ గార్డ్ తన వద్ద ఉన్న గన్తో ఆ బాలుడిపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రగాయాలపాలైన బాలుడు స్పృహ కోల్పోయాడు. కాల్పుల శబ్దం విని ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులకు రక్తపు మడుగులో ఉన్న అరవింద్ను చూసి షాకయ్యారు. కాల్పులు జరిపిన గార్డును పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోోయాడు.
కట్నం ఇచ్చినందుకు అమ్మాయి తండ్రిపై కేసు పెట్టండి.. జోధ్పూర్ కోర్టు సంచలన నిర్ణయం..
గార్డు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అరవింద్ను స్థానికులు బీఆర్డీ మెడికల్ కాలేజీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం లక్నోలోని ఎస్జీపీజీఐకు పంపారు. ప్రస్తుతం అరవింద్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. పన్నెండో తరగతి చదివిన బాధితుడు కూరగాయల వ్యాపారం చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఘటనకు సంబంధించి అరవింద్ తండ్రి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేశారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చేపట్టారు.