దారుణం : పంట బాగా పండాలని పన్నెండేళ్ల బాలున్ని బలిచ్చాడు...
భువనేశ్వర్ : మనిషి అంతరిక్షంలో అడుగుపెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాడు. టెక్నాలజీతో సరికొత్త ఆవిష్కరణలు సృష్టిస్తున్నాడు. ప్రపంచం అంతా 5జీ స్పీడ్తో దూసుకుపోతున్న నేటి తరుణంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూడనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చేతబడి, బాణామతులే కాదు.. చివరకు నర బలులకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఒడిశాలో ఇలాంటి దారుణమే జరిగింది. పంట బాగా పండాలని 12 ఏళ్ల బాలుడిని బలి ఇచ్చిన ఘటన వెలుగు చూసింది.
ఆరుగురు పోలీసుల సస్పెండ్ : 8 ఏళ్ల బాలిక లైంగికదాడి కేసులో చర్యలు
నమ్మించి వెంట తీసుకెళ్లి
ఒడిశాలోని నువాపడా జిల్లా జడముండాలో ఒళ్లు జలదరించే ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చింతామణి మాఝి తన తమ్ముడు సబన్ సింగ్ కొడుకైన దేబర్చంద్ మాఝితో కలిసి పొలంలో పొలంలో పనిచేస్తున్నాడు. ఉదయం పది గంటల సమయంలో సబన్ సింగ్ చిన్న కొడుకు పన్నెండేళ్ల ధన్ సింగ్, అన్నతో పాటు పెదనాన్నకు భోజనం తీసుకుని పొలానికి వెళ్లాడు. భోజనం తిన్న అనంతరం చింతామణి పొలంలో ఓ చెట్టు నరికేందుకు తోడు రమ్మంటూ ధన్సింగ్ను వెంట తీసుకెళ్లాడు. వారు వెళ్లిన కొద్ది సేపటికే దేబర్చంద్కు తమ్ముడి అరుపులు వినిపించాయి. పామును చూసి భయపడి ఉంటాడని భావించిన దేబర్ చంద్ అక్కడికి వెళ్లి చూసి షాక్ అయ్యాడు
గొడ్డలితో నరికి చంపిన నిందితుడు
చెట్టు నరికేందుకు తోడుగా తీసుకెళ్లిన ధన్ సింగ్ను చింతామణి దారుణంగా చంపేశాడు. గొడ్డలితో అతని మెడ నరికేశాడు. తమ్ముడి కేకలు విని దేబర్చంద్ అక్కడికి చేరుకునే సరికి మొండెం నుంచి తల వేరుచేశాడు. అక్కడి దృశ్యం చూసిన అతడు చుట్టుపక్కల వారిని పిలవడంతో చింతామని అక్కడి నుంచి పారిపోయాడు. దేబర్చంద్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు.
పంట బాగా పండాలని నరబలి
పోలీసుల విచారణలో నిందితుడు చింతామణి చెప్పిన విషయాలు విని పోలీసులు అవాక్కయ్యారు. కొన్నేళ్లుగా పంట సరిగా పండకపోవడంతో తాను ఓ మాంత్రికున్ని కలిసినట్లు చెప్పాడు. నరబలి ఇస్తే పంట బాగా పండుతుందన్న అతని సూచనల మేరకే తన తమ్ముడి కొడుకును బలి ఇచ్చానని స్పష్టం చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు చింతామణిని కోర్టులో హాజరుపరచగా... జడ్జి జ్యూడీషియల్ కస్టడీకి పంపారు. నరబలి ఇవ్వమని మంత్రగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.