హాస్టల్లో దారుణం: విద్యార్థిని కత్తెర క్రికెట్ స్టంపులతో చంపిందెవరు..?
చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కొడైకెనాల్లోని ఓ బోర్డింగ్ స్కూలులో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని తోటి విద్యార్థి చంపేశాడు. కత్తెర క్రికెట్ స్టంప్లతో పొడిచి చంపేశాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరూ 10వ తరగతి విద్యార్థులని తెలుస్తోంది.హాస్టల్లో ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే ఒక్కసారిగా ఇద్దరి మధ్య విబేధాలు చోటుచేసుకున్నాయి.దీంతో గొడవపడ్డారు.
గొడవ పెద్దదిగా మారడంతో ఏకంగా ముష్టియుద్ధానికే దిగారు. దీంతో ఓ విద్యార్థి ఆగ్రహంతో ఊగిపోయి మరొక విద్యార్థిపై కత్తెరతో పొడిచి ఆ తర్వాత క్రికెట్ స్టంప్లతో దాడి చేసి హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పలువురిని విచారణ చేసిన పోలీసులు హత్య చేసిన విద్యార్థిని అరెస్టు చేసి ప్రస్తుతానికి జువెనైల్ హోమ్కు తరలించారు. అయితే ఏ విషయమై ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.అయితే విద్యార్థులు గొడవ పడుతున్నప్పుడు వారిని ఆపేందుకు హాస్టల్ అధికారులు ఎందుకు ప్రయత్నించలేదనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరోవైపు మృతుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే చనిపోయిన విద్యార్థి మృతదేహాన్ని కొడైకెనాల్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్మార్టం కోసం పంపించారు. మణిపూర్ హాస్టల్లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వారంరోజులకు మరో విద్యార్థి హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. తమ బిడ్డ మృతిపై తల్లిదండ్రులు కూడా అనుమానస్పదమైన సమాధానాలు ఇచ్చారు. అమ్మాయి 27 మంది విద్యార్థులతో డార్మిటరీలో ఉండగా మృతి చెందింది. దీంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్కూలు యాజమాన్యం ఈ విషయం బయటకు రాకుండా దాచి ఉంచారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.