నేటి నుంచి శీతలపానీయాలు పెప్సీ, కోక్ బంద్
తమిళనాడు వ్యాపారులు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది షాపుల్లో పెప్సీ, కోక్ లను బహిష్కరించారు.
చెన్నై: టాప్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు పెప్సీ, కోక్ లకు తమిళనాడు వ్యాపారులు షాక్ ఇచ్చారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది షాపుల్లో పెప్సీ, కోక్ లను బహిష్కరించారు. స్థానిక తయారీదారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో పెప్సీ, కోక్ లకు రూ.1400 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. రాష్ట్రంలోని అతిపెద్ద వాణిజ్య సంఘం తమిళనాడు వానిగర్ సంగమ్ ఈ పెప్సీ, కోక్ లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సంఘంలో ఆరు వేలకుపైగా చిన్న, మధ్య తరహా దుకాణాలు, 15 లక్షలకుపైగా సభ్యులు ఉన్నారు. చిన్న చిన్న దుకాణాలలోనూ ఇక నుంచి ఈ శీతలపానీయాలు అమ్మబోరని ఆ సంఘం స్పష్టం చేసింది.
పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు కొంత సమయం కావాలని అడిగినా.. తాము అంగీకరించలేదని, బుధవారం సాయంత్రం దీనిపై సమావేశం కాబోతున్నామని ఆ సంఘం వెల్లడించింది.
గత జనవరి నెలలో జల్లికట్టు కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా వాణిజ్య సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. బహుళజాతి కంపెనీలు తయారు చేసే శీతలపానీయాల వల్ల స్థానిక తయారీదారులు తీవ్రంగా నష్టపోతున్నారని తమిళనాడు వానిగర్ సంగమ్ కార్యదర్శి కె.మోహన్ పేర్కొన్నారు.
ఈ విదేశీ సంస్థలు విలువైన నీటి సంపదను కూడా దోచుకుంటున్నాయని, రాష్ట్రం కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో బహుళ జాతి కంపెనీలు శీతలపానీయాల తయారీ పేరుతో నీటిని దోచుకోవడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.