ఇలా చేస్తే కచ్చితంగా సినిమా చూస్తా.. చపాక్ వివాదంపై కనిమొళి.. జేఎన్యూలో ఐషేకు పరామర్శ
జేఎన్యూలో విద్యార్థులపై పాశవిక దాడికి పాల్పడిన వాళ్లపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని, ఇది ఒక్క జేఎన్యూపై జరిగిన దాడి కాదని, దేశంలో విద్యావ్యవస్థను, విద్యాలయాల్ని ధ్వంసం చేయాడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని జేఎన్యూకు వచ్చిన ఆమె.. వర్సిటీ స్డూడెంట్ లీడర్ ఐషే ఘోష్ ను, దాడిలో గాయపడ్డ ఇతర విద్యార్థులనూ పరామర్శించారు.
జేఎన్యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన నటి దీపిక పదుకొనెకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలుపెట్టిన బీజేపీ.. ఆమె నటించిన 'చపాక్'సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఈ వివాదంపై కనిమొళి ఘాటుగా స్పందించారు. ''నిజానికి నేను హిందీ సినిమాలు పెద్దగా చూడను. కేవలం విద్యార్థులకు మద్దతు తెలిపిందన్న కారణంతో దీపిక సినిమాల్ని బహిష్కరిద్దామని ప్రచారం చేస్తే గనుక నేను కచ్చితంగా సినిమా చూస్తా. ఆమెకు మద్దతుగా నిలబడతా''అని కనిమొళి చెప్పారు.
జేఎన్యూ హింసాకాండను ఖండించిన రాజకీయ పార్టీల్లో డీఎంకే కూడా ఒకటి. పార్టీ చీఫ్ స్టాలిన్ ఆదేశాల మేరకే కనిమొళి జేఎన్యూకు వెళ్లి, స్టూడెంట్లను పరామర్శించినట్లు తెలిసింది. అంతకుముందు సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా జేఎన్యూకు వెళ్లిన గాయపడ్డ విద్యార్థుల్ని పరామర్శించారు.