సహజీవనం: ప్రియురాలిని హత్య చేసి లోయలో పడేసిన బిపిఓ ఉద్యోగి
చెన్నై: ఆ ఇద్దరూ ఎంతో అవగాహనతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మంచి ఉద్యోగాల్లో ఉన్న వారు గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఏమైందో ఏమో గానీ ఒక్కసారిగా ప్రేమించిన ప్రియుడే ఆ యువతికి కాలయముడయ్యాడు. ఆమెను దారుణంగా హత్య చేసి, కొండపైనుంచి లోయలోకి తోసేశాడు. ఈ దారుణ తమిళనాడులోని చెన్నైలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అంబత్తూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న దినేశ్ కన్నప్పన్ (24)కు ఎఫ్సిఐ ఉద్యోగిని అయిన అరుణ(22)తో నాలుగేళ్ల నుంచి పరిచయం ఉంది. గత మూడేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని బైపాస్ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేర్పించిన దినేశ్.. సోమవారం రాత్రి అరుణ ఇంటికి వెళ్లాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ పడ్డారు. కోపంతో ఉన్మాదిగా మారిన దినేశ్ ఫ్లవర్ వాజ్తో అరుణ తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అరుణ అక్కడికక్కడే మృతిచెందింది.
గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని బెడ్ షీట్లో చుట్టి కారు డిక్కీలో పెడుతుండగా స్థానిక యువకుడొకరు దినేశ్ చర్యను గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. తాను అనుకున్న ప్రాంతానికి చేరుకున్న దినేశ్.. పోలీసులు చేరుకునేలోపే అరుణ మృతదేహాన్ని లోయలోకి నెట్టేశాడు.
కాగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు అతడు అక్కడ నుంచి పరారయ్యాడు. హత్యకు దారితీసిన కారణమేమిటో ఇప్పటివరకు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న దినేశ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తే గానీ పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.