‘ఈ టాయిలెట్ బ్రాహ్మణులకు మాత్రమే’.. కేరళ ఆలయంలో మరుగుదొడ్డిపై రాతలు.. దుమారం..
సిటీల్లో అద్దె ఇళ్ల కోసం తిరిగే వాళ్లందరికీ 'కులం కార్డు'అనుభవం ఎదురయ్యే ఉంటుంది. 'ఫలానా కులం వాళ్లకు మాత్రమే అద్దెకిస్తాం' 'ఫలానా ఆహారం తినేవాళ్లకే ఇల్లిస్తాం' తరహా రాతలు కొత్తేమీకాదు. కానీ టాయిలెట్ల మీద కులం మార్కు కనిపించడం కేరళలో కలకలం రేపింది. సాధారణంగా జనసమూహాలు వెళ్లే చోట టాయిలెట్ల దగ్గర 'మెన్' లేదా 'విమెన్' అని రాసుండటం తెలిసిందే. అక్కడ మాత్రం 'ఈ టాయిలెట్ బ్రాహ్మణులకు మాత్రమే'అని తాటికాయంత అక్షరాలతో కనిపిస్తుంది.
కేరళలోని త్రిసూర్ పట్టణ శివారులో కుట్టుముక్కు మహదేవ ఆలయం ప్రాంగణంలోని టాయిలెట్ల ఫొటోలు రెండ్రోజులుగా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆ దేవస్థానం ట్రస్టు వాళ్ల వివరణ ప్రకారం.. గత 25 ఏళ్లుగా అక్కడి టాయిలెట్ల మధ్య విభజన కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా ఏ ఒక్కరూ దాన్ని గుర్తించి, పట్టించుకోలేదు. త్రిసూర్కే చెందిన పరిశోధన విద్యార్థి అరవింద్ వాటిని ఫొటోలు తీసి ట్విటర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో దుమారం చెలరేగింది.
కాగా, ఆలయంలో పనిచేసే సిబ్బందిలో ఆడ, మగ కోసం విడివిడిగా రెండు టాయిలెట్లు.. పూజాదికార్యక్రమాలు నిర్వహించే అర్చకుల కోసం పక్కనే మరో టాయిలెట్ వాడుతున్నామని, అయితే వాటిపై 'బ్రాహ్మణులకు మాత్రమే'అని రాయడం మాత్రం తప్పేనని కొచ్చిన్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ ఏబీ మోహన్ అన్నారు. మరుగుదొడ్డిపై కులం రాతలు వ్యవహారం సోషల్ మీడియాలో వైరలైన తర్వాత వానిరి తొలగించామని, దీనిపై విచారణకు కూడా ఆదేశించామని సదరు అధికారి వివరించారు.