రక్షణశాఖ అమ్ములపొదిలో మరో అస్త్రం..బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం సక్సెస్
ఒడిషా: భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఒడిషా రాష్ట్రంలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం చేశారు. భూమిపై ఉన్న లక్ష్యాలను చేధించేలా బ్రహ్మోస్ క్షిపణిని రూపొందించారు.
ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను చేధించగల క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు డీఆర్డీఓ వెల్లడించింది. బ్రహ్మోస్ క్షిపణి మీడియం రేంజ్ క్షిపణి. వీటిని యుద్ధ నౌకల నుంచి , జలాంతర్గామిల నుంచి, లేదా ఫైటర్ జెట్ల నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను చేధించేందుకు ఉపయోగించడం జరుగుతుందని డీఆర్డీఓ పేర్కొంది.450 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల సామర్థ్యం ఉన్న బ్రహ్మోస్ క్షిపణిలను మార్చి 11, 2017న ప్రయోగించడం జరిగింది.
తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు రూపొందించబడ్డ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం 2019 సెప్టెంబర్ 30వ తేదీన విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. బ్రహ్మోస్ మిషన్ను డీఆర్డీఓ మరియు రష్యాకు చెందిన ఎన్పీఓఎంలు సంయుక్తంగా రూపొందించాయి.ఈ క్షిపణులను త్రివిధ దళాలు అయిన భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లు వినియోగిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణిగా బ్రహ్మోస్ క్షిపణి గుర్తింపు పొందింది. ఆధునిక యుద్ధకాలంలో బ్రహ్మోస్ క్షిపణి ప్రధాన పాత్ర పోషిస్తోందని డీఆర్డీఓ అధికారులు తెలిపారు. భూమిపై ఉన్న లక్ష్యాలను చేధించడం, గాల్లో ఉన్న లక్ష్యాలను చేధించడం వీటి ప్రత్యేకత అని వారు చెప్పారు.