అక్కడ 'రామ' కలిసిరావట్లేదు.. ఆ పేరును మార్చాలనుకుంటున్న బీజేపీ సర్కార్..
'రామ' అన్న పేరు బీజేపీకి ఎంత పెద్ద బ్రాండ్ అన్నది అందరికీ తెలిసిందే. కానీ విదేశీ పెట్టుబడుల విషయంలో మాత్రం ఆ పేరు అంతగా కలిసిరావట్లేదట. రామ ఏంటీ.. విదేశీ పెట్టుబడులు ఏంటీ అనుకుంటున్నారా..? ఇదంతా కర్ణాటక సంగతి. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో రామనగర అనే ఓ జిల్లా ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు అసవరమైన వనరులన్నీ ఇక్కడ ఉండటంతో దీన్ని పారిశ్రామిక కేంద్రంగా చేసేందుకు అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఎంత ప్రయత్నించినా పెట్టుబడులను మాత్రం ఆకర్షించలేకపోతున్నారట. ఈ సమస్యను అధిగమించేందుకు బీజేపీ సర్కార్ కొత్త ఆలోచన చేసింది.
నవ బెంగళూరుగా రామనగర.. :
'రామనగర' పేరుతో ఉన్న జిల్లాకు పెట్టబడులు రావట్లేదు కాబట్టి.. దాన్ని 'నవ బెంగళూరు'గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందట. ముంబై ఎలాగైతే నేవీ ముంబైగా విస్తరించిందో.. అదే తరహాలో రామనగర జిల్లాకు నవ బెంగళూరుగా నామకరణం చేస్తే.. అక్కడ పారిశ్రామిక అభివృద్ది జరుగుతుందనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. రామ బ్రాండ్ కంటే,బెంగళూరు బ్రాండ్తో విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చునని భావిస్తోంది.
బెంగళూరు,మైసూరు మధ్యలో :
బెంగళూరుకు 30కి.మీ దూరంలో రామనగర జిల్లా ఉంటుంది. 2006లో గ్రేటర్ బెంగళూరులో ఇదో తాలుకాగా ఉండేది. అప్పటి ముఖ్యమంత్రి,రామనగర ఎమ్మెల్యే హెచ్డి కుమారస్వామి.. బెంగళూరు రూరల్ జిల్లాలోని కొన్ని తాలుకాలతో కలిపి రామనగరను జిల్లాగా ఏర్పాటు చేశారు. బెంగళూరు రూరల్ జిల్లాతో పోల్చితే రామనగరలో నీళ్లు, ప్రభుత్వ భూమికి కొదువ లేదు. పైగా బెంగళూరు,మైసూరు నగరాలకు మధ్యలో ఉండటం రామనగరకు ప్లస్ పాయింట్.
పెట్టుబడుల కోసం..
రామనగరకు ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా.. పెట్టుబడులను ఆకర్షించేందుకు అవేవీ సరిపోవడం లేదు. బయటి ప్రపంచానికి దాని గురించి తెలియాలంటే బ్రాండింగ్ మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రామనగరకు బదులు.. బెంగళూరు అనే బ్రాండ్తో ప్రమోట్ చేయాలనుకుంటోంది. ఇందుకోసం నవ బెంగళూరు అనే పేరును కూడా దాదాపుగా ఖరారు చేసింది. బెంగళూరు బ్రాండ్తో పెట్టుబడులు తరలివస్తాయని భావిస్తోంది.
ధ్రువీకరించిన అధికారి :
రామనగర ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఒకరు పేరు మార్పు అంశాన్ని ధ్రువీకరించారు. పేరు మార్పుపై ప్రజలు సలహాలు సూచనలు ఇచ్చారని,తుది నిర్ణయం ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. నిజానికి 2006లోనే రామనగర బదులు సౌత్ బెంగళూరు అనే పేరు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, అదే జిల్లాలోని కనకపుర ఎమ్మెల్యే డీకె శివకుమార్ సూచించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ సూచనను పట్టించుకోలేదు. తాజాగా ప్రభుత్వం రామనగర పేరు మార్పుకు సిద్దమవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రామనగర ఎమ్మెల్యే,కుమారస్వామి సతీమణి అనిత దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది.