రైతులను అవమానిస్తారా?: ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్యకు ప్రివిలేజ్ నోటీసు
రైతు రుణమాఫీపై ఎస్బీఐ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యలపై మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత రాధాకృష్ణ వైఖే పాటిల్..
ముంబై: రైతు రుణమాఫీపై ఎస్బీఐ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య వ్యాఖ్యలపై మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత రాధాకృష్ణ వైఖే పాటిల్.. స్పీకర్కు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. రుణ మాఫీ అంశంలో సభను, రైతులను అవమానపర్చేలా ఆమె వ్యాఖ్యలున్నాయని ఆయన ఆరోపించారు.
మహారాష్ట్రలోనే గత రెండేళ్ల కాలంలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు. అందుకే ప్రజలు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. రైతు రుణాల మాఫీని క్రమశిక్షణ తప్పుతోందనడంపై ఆయన మండిపడ్డారు.
వ్యవసాయాభివృద్ధే ప్రధానం
దేశ ఆర్థిక వృద్ధిరేటు గరిష్ఠ స్థాయికి చేరుకోవాలంటే వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిసారించాలని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించనంతవరకు బ్యాంకుల రుణ డిమాండ్ పుంజుకోదని ఆమె అన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఒకటి మూలధన వృద్ధి కాగా రెండోది ఆస్తుల నాణ్యత.
శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశంలో భట్టాచార్య మాట్లాడుతూ.. రుణ డిమాండ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతోపాటు గతంలో కార్పొరేట్ రంగానికిచ్చిన రుణాల్లో చాలా వరకు నిరర్థక ఆస్తులుగా మారడమే ఆస్తుల నాణ్యత సమస్యకు ప్రధాన కారణమని అన్నారు. అందుకే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి కొన్ని దశాబ్దాల కనిష్ఠానికి (5 శాతం) పడిపోయింది. ఇప్పట్లో రుణ వృద్ధి తిరిగి పుంజుకునే అవకాశాలు కన్పించడం లేదని భట్టాచార్య అన్నారు. వరుసగా రెండేండ్లపాటు కరువు పరిస్థితులు ఏర్పడటంతో భారీగా దెబ్బతిన్న దేశీయ వ్యవసాయ రంగానికి ఊతమివ్వాలని, అప్పుడే జీడీపీ పరుగులు పెట్టగలదని ఆమె అన్నారు.
గ్రామీణ భారతం నుంచి సరైన డిమాండ్ లేకపోవడంతో గత ఏడాదిలో ఎస్బీఐలో వ్యవసాయ రుణాల మంజూరు కేవలం 3.27 శాతం వృద్ధి చెంది రూ.1,25,068 కోట్లుగా నమోదైంది. మొండి బకాయిలు కూడా గణనీయంగా పెరిగాయి. డిసెంబర్ 2016 నాటికి స్థూల నిరర్థక ఆస్తుల వాటా 5.93 శాతానికి చేరుకుందని భట్టాచార్య వెల్లడించారు.