పఠాన్కోట్ దాడి: 'సీరియస్ విషయం, అసలేం జరిగింది.. మోడీ చెప్పాలి'
తిరువనంతపురం: పఠాన్కోట్ ఉగ్ర దాడి పైన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికైనా మౌనం వీడాలని, ఏం జరిగిందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ గురువారం నాడు డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ ఇప్పటికైనా పెదవి విప్పాలన్నారు. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ పైన దాడి గురించి మట్లాడాలన్నారు. ఉగ్రవాదుల చొరబాట్లను నివారించడంలో లొసుగులు బయటపడ్డాయని, అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
కాబట్టి ప్రధాని మోడీ ఇప్పటికైనా జరిగింది ఏమిటో దేశ ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యటన అనంతరం ఈ దాడి జరిగిందన్నారు. కాబట్టి ఈ దాడి ఎందుకో తెలుసుకోవాలని దేశం అనుకుంటోందన్నారు.
ఇది చాలా సీరియస్ విషయమన్నారు. ప్రధాని మోడీ ఈ విషయంలో ఎంతమాత్రం మౌనం వహించలేరన్నారు. కచ్చితంగా అతను మాట్లాడాల్సిందేనని చెప్పారు. అసలు ఏం జరిగిందనే విషయం ఆయన భారత జాతికి చెప్పాలన్నారు.