షాకింగ్: ఢిల్లీలో ఒక్కరోజు గడిపితే.. 45 సిగరెట్లు తాగినట్లే!
ప్రస్తుతం ఢిల్లీలోని గాలిలో స్వచ్ఛత అత్యంత ప్రమాదకరస్థాయిని దాటేసి ప్రాణాంతక స్థితికి చేరుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఢిల్లీలో ఒక్క రోజు గడిపితే 45 సిగరెట్లు తాగినంత హాని జరుగుతుందని వైద్యులు చెబుత
ఢిల్లీ: దీపావళి తర్వాత దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కాలుష్యం అనూహ్యంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి గాలిని గుండెల నిండా పీల్చలేక ప్రస్తుతం ఢిల్లీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Recommended Video
ప్రస్తుతం ఢిల్లీలోని గాలిలో స్వచ్ఛత అత్యంత ప్రమాదకరస్థాయిని దాటేసి ప్రాణాంతక స్థితికి చేరుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... ఢిల్లీలో ఒక్కరోజు గడిపితే 45 సిగరెట్లు తాగినంత హాని జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
గాలిలో కాలుష్యం నాణ్యత సూచి ప్రకారం 100 పాయింట్లు దాటితేనే ప్రమాదంగా పరిగణిస్తారు. అలాంటిది ఢిల్లీలో ఏక్యూఐ ఏకంగా 999కు చేరుకోవడం అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
కాలుష్య కాసారంగా మారిన ఈ గాలిని పీల్చితే కొద్దిరోజుల్లోనే ప్రాణాలు పోవడం ఖాయమని అక్కడి వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఉన్న స్థితి మరో రెండ్రోజులపాటు కొనసాగుతుందని కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది.
నగరమంతా పొగ మంచు ఆవహించగా, రహదారులపై పట్టుమని పది కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించలేని దుస్థితి నెలకొంది. కాలుష్య నియంత్రణకు అధికారయంత్రాంగం సరిగ్గా పనిచేయడం లేదని మానవ హక్కుల కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఎవరి చావు వారు చావాలన్న చందంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ, కేంద్రప్రభుత్వం సహా ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు కమిషన్ నోటీసులు కూడా పంపింది.
గతంలో లండన్ అనుభవించిన నరకం ఇప్పుడు ఢిల్లీ అనుభవిస్తోందని, తాత్కాలిక ఉపశమన మార్గాలు కాకుండా, శాశ్వత పరిష్కారం ఆలోచించాలని ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచించింది.
మరోవైపు జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని, డీజిల్ సాయంతో నడిచే భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించాలని, పరిశ్రమల్లో కార్యకలాపాలు ఆపేయాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది.