మోడీ సొంత రాష్ట్రంలో సంచలనం: రూ.3లక్షల లంచం.. అన్ని కొత్త నోట్లే..
అహ్మదాబాద్ : నోట్ల రద్దుతో.. కొత్త నోట్ల దొరక్క.. సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు ఏకంగా రూ.3లక్షల మొత్తాన్ని లంచంగా చెల్లించిన ఘటన వెలుగుచూడడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. ఘటన వెలుగుచూసింది మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో కావడం అధికార పక్షాన్ని మరిన్ని విమర్శలకు గురిచేస్తోంది.
పట్టుబడ్డ రూ.3లక్షల్లో మొత్తం రూ.2వేల కొత్త నోట్లు ఉండడంతో అధికారులు సైతం షాక్ తిన్నారు. బ్యాంకుల్లో ఒక్కో వ్యక్తి వారానికి గరిష్టంగా రూ.24వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఇంత భారీ మొత్తంలో లంచం చెల్లించడానికి డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది ప్రస్తుతం సర్వత్రా వ్యక్తమవుతోన్న ప్రశ్న. గుజరాత్లోని కాండ్లా నౌకాశ్రయంలో ఈ ఘటన వెలుగుచూసింది.
ఓ ఎలక్ట్రానిక్ సంస్థకు చెందిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడం కోసం.. కాండ్లా పోర్ట్ ట్రస్టుకు చెందిన ఇద్దరు అవినీతి అధికారులు రూ.4.4లక్షలను లంచంగా డిమాండ్ చేశారు. చివరకు మధ్యవర్తి జోక్యంతో రూ.3లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. దీంతో రూ.2వేల నోట్ల కట్టలతో 3లక్షలను లంచంగా చెల్లించింది సదరు ఎలక్ట్రానిక్ సంస్థ. విషయం పోలీసుకు తెలిసి నిందితులు అరెస్టు చేయడంతో.. ఘటన వెలుగులోకి వచ్చింది.
నిందితుల వద్ద నుంచి రూ.2.5లక్షల కొత్త నోట్లు, వారి ఇంటి వద్ద రూ.40వేలు విలువ చేసే కొత్త నోట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఊతమిచ్చినట్టయింది. సామాన్యులను ఇబ్బందిపెట్టడానికే తప్పితే.. బడాబాబులెవరు నోట్ల రద్దు కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవట్లేదని ప్రతిపక్షాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే.
నోట్ల రద్దు నేపథ్యంలో.. ఇంత భారీ మొత్తంలో డబ్బు వారి చేతిలోకి ఎలా వచ్చిందన్నది తేలాల్సి ఉంది. కొత్త నోట్ల దొరక్క.. దొరికిన నోటుకు చిల్లర లేక సామాన్యులంతా అల్లాడుతుంటే.. బడాబాబులకు మాత్రం లంచాలు ఇచ్చుకోవడానికి ఇంత భారీ మొత్తం అందుబాటులోకి రావడం పలు అనుమానాలను లేవనెత్తుతోంది.