లంచం కోసం పీడించిన పోలీసు, తప్పించుకోడానికి ప్రయత్నించిన డ్రైవర్, గాయాలు, చివరికి !
బెంగళూరు: లంచం కోసం ట్రాక్టర్ వెంట పడటంతో బాలిక ప్రమాదవశాత్తు వాహనం నుంచి కిందపడింది. బాలికకు తీవ్రగాయాలైనాయని గుర్తించిన గ్రామస్తులు పోలీసును పట్టుకుని చితకబాదిన ఘటన కర్ణాటకలోని విజయపుర నగరం సమీపంలో జరిగింది.
విజయపుర సమీపంలోని గ్రామస్తులు సోమవారం వారి కుల దైవంకు ప్రత్యేక పూజలు చెయ్యడానికి ట్రాక్టర్ లో వెళ్లారు. పూజలు ముగించుకుని తిరిగి ట్రాక్టర్ లో సొంత గ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో కానిస్టేబుల్ బసవరాజ్ పూజార్ ట్రాక్టర్ నిలిపాడు.
ట్రాక్టర్ లో మనుషులు ప్రయాణించరాదని డ్రైవర్ ను బెదిరించాడు. గుడికి వెళ్లామని డ్రైవర్ మనవి చేశాడు. వెయ్యి రూపాయలు లంచం ఇవ్వాలని కానిస్టేబుల్ బసవరాజ్ పూజార్ డిమాండ్ చేశాడని తెలిసింది. డ్రైవర్ రూ. 200 పోలీసు బసవరాజ్ పూజార్ కు ఇచ్చాడు.
రూ. 200 తీసుకున్న బసవరాజ్ పూజార్ ఇంకా రూ. 800 ఇవ్వాలని పీడించాడు. పోలీసు నుంచి తప్పించుకోవాలని డ్రైవర్ ట్రాక్టర్ ను వేగంగా నడిపాడు. ఆ సందర్బంలో లంచం కోసం కానిస్టేబుల్ బసవరాజ్ పూజార్ బైక్ లో ట్రాక్టర్ ను వెంబడించాడు. ఆ సందర్బంలో ట్రాక్టర్ వేగంగా నడపడంతో అందులో ప్రయాణిస్తున్నం అశ్వినీ (16) అనే బాలిక ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రగాయాలైనాయి.
బాలిక గాయపడిన విషయం గుర్తించిన స్థానికులు కానిస్టేబుల్ బసవరాజ్ ను పట్టుకుని చితకబాదేశారు. బాలికను, తీవ్రగాయాలైన బసవరాజ్ పూజార్ ను విజయపుర జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఆసుపత్రి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేస్తున్నారు.